year ender 2022: భారత్ సహా ప్రపంచానికి రిలీఫ్! కానీ, చైనాలో కోవిడ్ కల్లోలం
న్యూఢిల్లీ: కరోనావైరస్(కోవిడ్ 19) మహమ్మారి 2019లో చైనాలో పుట్టి.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దాదాపు నాలుగు సంవత్సరాలపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో లక్షలాది మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుంది ఈ మహమ్మారి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్లు, షట్డౌన్లతో ప్రజలు అల్లాడిపోయారు.
2019 డిసెంబర్లో చైనాలో పుట్టిన కరోనా వైరస్
కరోనా వైరస్ ను మొట్టమొదటి సారిగా 1960లో కనుగొన్నారు. క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత చైనాలోని వుహాన్లో 2019 డిసెంబర్ 1న కరోనావైరస్ను గుర్తించారు. 2020 మార్చి నాటికి ప్రపంచ వ్యాప్తంగా లక్ష కేసులు నమోదయ్యాయి. దాదాపు వంద దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. కరోనా బారిన లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ తోపాటు అనేక ప్రపంచ దేశాలు లాక్డౌన్లు అమలు చేశాయి.
భారత్లో తొలి కోవిడ్ కేసు 2020లోనే.. ఆ రెండేళ్లు
భారతదేశంలో మొదటి కరోనా కేసు 2020 జనవరి 30న నమోదైంది. చైనాలోని వుహాన్ నుంచి తిరిగి వచ్చిన కేరళ విద్యార్థికి కరోనా సోకడంతో దేశంలో మొదటి పాజిటివ్ కేసు నమోదైంది. 2020-2021 సంవత్సరాల్లో కరోనా వైరస్ ప్రభావం దేశంలో తీవ్రంగా ఉండింది. పలుమార్లు లాక్డౌన్లు విధించారు. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్లను కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనదేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్, తోపాటు పలు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత ప్రభుత్వం దేశంలోని ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ అందజేసింది.
భారత్ను కుదిపేసిన కరోనా.. 2022లో రిలీఫ్!
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం. భారతదేశంలో, 3 జనవరి 2020 నుంసీ 19 డిసెంబర్ 2022 వరకు, 530,674 మరణాలు నమోదవగా.. 44,676,087 కోవిడ్ కేసులు రికార్డయ్యాయి. 5 డిసెంబర్ 2022 నాటికి, మొత్తం 2,199,517,388 టీకా మోతాదులు ఇవ్వబడ్డాయి. 2019 నుంచి 2022 సగం భాగం వరకు కరోనా వైరస్ తన ప్రభావం చూపింది. భారత ఆర్థిక వ్యవస్థను కూడా కుదిసేసింది. ఆ తర్వాత 2022 మే నుంచి మనదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం మనదేశంలో ప్రజలు దాదాపు కరోనా ముందులా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
చైనాలో మళ్లీ కోవిడ్ 19 కల్లోలం.. ప్రపంచానికి టెన్షన్!
అయితే, ప్రపంచానికి కరోనా మహమ్మారి నుంచి విముక్తి దాదాపు లభించగా.. ఆ వైరస్ పుట్టినిల్లయినా చైనా మాత్రం ఇప్పుడు అల్లాడిపోతోంది. చైనాలో కరోనా వైరస్ గత కొద్ది వారాలుగా విజృంభిస్తోంది. దీంతో కఠిన లాక్డౌన్ అమలు చేస్తున్నారు. మరోవైపు, ఈ నిబంధనలకు వ్యతిరేకంగా చైనాలో తీవ్ర ఆందోళనలు కూడా చెలరేగాయి. దీంతో కరోనా నిబంధనలను కాస్త సడలించేందుకు చైనా ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే, చైనాలో ఇప్పుడు రోజుకు వెయ్యి నుంచి 5వేల కేసులు నమోదవుతుండటంతో మళ్లీ ఆందోళన మొదలైంది. ప్రస్తుతం చైనాకే పరిమితమైన ఈ మహమ్మారి మళ్లీ ప్రపంచంవైపు దూసుకొస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. వచ్చే మూడు నెలల్లో చైనాలో 60 శాతం మందికి కరోనావైరస్ బారిన పడతారని నిపుణులు అంచనా వేస్తుండటం గమనార్హం. చైనా సమర్థవంతంగా కరోనాను కట్టడి చేయకపోతే.. ఆ మహమ్మారి మళ్లీ పంజా విసురుతుందా? అనేది నిపుణులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.