అసాంఘిక శక్తులతో పోరాటం: సునీతా కృష్ణన్కు యుద్దవీర్ అవార్డు
హైదరాబాద్: మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు అసాంఘిక శక్తులతో పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త, ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునీత కృష్ణన్ ప్రతిష్టాత్మక యుద్ధవీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. యుద్ధవీర్ ఫౌండేషన్ అధ్యక్షుడు నరేంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు.
స్వాతంత్ర సమరయోధుడు, హిందీ మిలాప్ వ్యవస్థాపక సంపాదకుడు దివంగత యుద్ధవీర్ పేరిట ఈ పురస్కారాన్ని నెలకొల్పారు. గత 23 ఏళ్లుగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి దీనిని అందిస్తున్నారు. ఈ పురస్కారాన్ని అందుకోనున్న 24 వ్యక్తి సునీతా కృష్ణన్.
వ్యభిచార గృహాల నుండి మహిళలకు, బాలికలకు విముక్తి కల్పించి, వారి భవిష్యత్తుకు మూల స్తంభంలా సునీతా కృష్ణన్ నిలిచారని యుద్ధవీర్ ఫౌండేషన్ పేర్కొంది. ఏప్రిల్ 30వ తేదీన యుద్ధవీర్ జయంతి సందర్భంగా ఫ్యాఫ్సీ భవన్లో ఆమెకు దీనిని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అందిస్తారు.
కాగా, కొద్ది రోజుల క్రితం సునీతా కృష్ణన్ ఇంటర్నెట్లో పెట్టిన అత్యాచార వీడియోను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. అత్యాచార నిందితులను పట్టుకోవాలంటూ సునితా కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్లో ఓ వీడియోను అప్ లోడ్ చేశారు. దీనిని సుమోటోగా తీసుకున్న సుప్రీం... సెక్సువల్ వయోలెన్స్ కింద విచారణ చేపట్టాలని ఆదేశించింది.