కాశ్మీర్ లేని భారత్, ఫేస్బుక్పై నెటిజన్ల ఆగ్రహం, సరిదిద్దుకున్నజుకర్బర్గ్
న్యూఢిల్లీ: తలలేని భారత చిత్రపటాన్ని పోస్ట్ చేసిన విమర్శలు మూటగట్టుకున్న ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ తన తప్పును సరిదిద్దుకున్నాడు. జమ్మూ కాశ్మీర్లో కొంత భాగం లేకుండా ఆయన భారత చిత్రపటాన్ని పోస్ట్ చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
భారతీయ నెటిజన్లు ఆయన పైన మండిపడ్డారు. భారతీయులకు ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందించేలా ప్రారంభించిన ఇంటర్నెట్ డాట్ ఓఆర్జీని మనీలాలో ఆయన ప్రారంభించారు. భారత్లో కూడా ఉచిత సేవలు అందుతాయని అప్పుడు చెప్పాడు.
అందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేకుండా భారత చిత్రపటాన్ని పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. భారత్ మ్యాప్ను సరిదిద్దుకోకుంటే భారతీయులంతా ఫేస్బుక్ను ఉపయోగించరని ఆగ్రహించారు.
మరో నెటిజన్ అయితే.. నిన్న చైనా, నేడు జుకర్ బర్గ్ భారత చిత్రపటాన్ని తప్పుగా ముద్రించారని, కాశ్మీర్ లేకుండా వేశారని, ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఫేస్బుక్ను బ్యాన్ చేస్తుందని భావిస్తున్నానని రాశారు. మరికొందరు తమకు ఉచిత సేవలు వద్దని నిరసన వ్యక్తం చేశారు. దీంతో తగ్గిన జూకర్ బర్గ్ తన తప్పును సరిదిద్దుకున్నాడు.
తనకు భారత్ను అవమానించే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని చెప్పాడు. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అలా ప్రవర్తించలేదన్నాడు. కాగా, ప్రధాని మోడీ చైనా పర్యటనకు ముందు.. చైనీస్ స్టేట్కు చెందిన సీసీటీవీ జమ్మూ కాశ్మీర్, అరుఅాచల్ ప్రదేశ్ లేకుండా మ్యాప్ వేసింది.