ఉరిశిక్ష అమలైన నెలలకు అఫ్జల్ గురు బుక్ విడుదల!
శ్రీనగర్: పార్లమెంటుపై దాడి కేసులో ఉరితీయబడ్డ అఫ్జల్ గురు రాసినదని చెబుతున్న పుస్తకం ఒకటి బయటకు వచ్చింది. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలై ఏడు నెలలు దాటింది. ఇప్పుడు ఆయన రాసినట్లుగా చెబుతున్న ఓ పుస్తకం విడుదలైంది.
అందులో తాలిబన్ అగ్రనేత ముల్లా ఓమర్ పైన అఫ్జల్ ప్రశంసలు కురిపించినట్లు వ్యాఖ్యలు ఉన్నాయి. ఓమర్ చీకట్లో కాంతి రేఖ అని, అభివృద్ధి చెందిన టర్కీ, అణ్వాయుధాలున్న పాకిస్తాన్ సహా అరబ్ దేశాలు అగ్ర రాజ్యానికి భయపడుతుంటే ఆఫ్గనిస్తాన్లో అమెరికా, నాటో దళాల ఆధిపత్యాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా తాలిబన్లను ఓమర్ నడిపిస్తున్నారని ప్రశంసించాడు.
ఉర్దూలో, 94 పేజీలతో ఉన్న ఈ పుస్తకానికి వేర్పాటు వాద నాయకుడు షఫీ అహ్మద్ ఖాన్ సంపాదకుడిగా వ్యవహరించారు. అఫ్జల్ గురు తీహార్ జైలులో ఉన్నప్పుడు కాశ్మీరీ ప్రజల కోసమని తనకు ఈ సందేశం పంపించారంటూ షఫీ పుస్తకంలో పేర్కొన్నారు.
ఈ పుస్తకాన్ని మంగళవారం శ్రీనగర్లోని ఓ హోటల్లో విడుదల చేశారు. ఈ విడుదల కార్యక్రమానికి అఫ్జల్ భార్య, తనయుడు రాలేదు. తాము ఐదువేల కాపీలు వేశామని షఫీ చెప్పాడు.