భారత సంతతి ప్రీతిపటేల్కు బ్రిటన్లో కేబినెట్ హోదా, పాక్ జాతీయుడికీ
లండన్: బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ మంత్రివర్గంలో భారతీయురాలికి చోటు దక్కింది. ప్రధాని కామెరాన్ నూతన కేబినెట్లో భారతీయ సంతతి మహిళకు చోటు ఇచ్చారు. ఇటీవలి ఎన్నికలలో రెండోసారి గెలిచిన ప్రీతి పాటిల్ను ఉపాధి కల్పన శాఖ మంత్రిగా నియమించారు.
మే ఏడో తేదీన జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎస్సెక్స్లోని విఠమ్ నుండి ఆమె ఎంపీగా తిరిగి గెలుపొందారు. గత మంత్రివర్గంలో ఆర్థిక శాఖ సహాయమంత్రిగా ఆమె పని చేశారు. బ్రిటన్ ప్రధాని తరఫున భాత సంతతి వ్యక్తుల యోగక్షేమాలను పర్యవేక్షించే పాత్రలోను ప్రీతి పటేల్ కొనసాగే అవకాశముంది.
ఉపాధిశాఖ మంత్రిగా నియమితులవడం పట్ల ప్రీతి పటేల్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు. ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రీతి సహా పలువురు మహిళలను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా పార్టీ పైన ఉన్న పురుషాధిక్య ముద్రను తొలగించేందుకు కామెరూన్ ప్రయత్నించారని అంటున్నారు. పాకిస్తాన్ సంతతికి చెందిన ఎంపీ సాజిద్ జావిద్ను కూడా కూడా కామెరూన్ కేబినెట్లోకి తీసుకున్నారు. సాంస్కృతిక శాఖ నుండి వాణిజ్య శాఖ మంత్రిగా సాజిద్ను మార్చారు. కాగా, సాజిద్ ఓ బస్సు డ్రైవర్ కొడుకు కావడం గమనార్హం.