షాక్: ఎటిఎంల నుండి డబ్బులు మాయం, జాక్పాటింగ్ దాడులు
వాషింగ్టన్: ఎటిఎంలపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని డీబోల్డ్ నిక్స్డార్ప్, ఎన్సీఆర్ కార్పోరేషన్ హెచ్చరించింది. అమెరికాలో ఈ తరహ దాడి ఒకటి చోటుచేసుకొందని కూడ ఆ సంస్థ ప్రకటించింది. ఎటీఎంల తయారీలో ఈ సంస్థ పేరొందింది. సైబర్ నేరగాళ్ళు జాక్ పాటింగ్కు పాల్పడుతున్నారని ఆ సంస్థ బ్యాంకర్లకు ముందు జాగ్రత్త హెచ్చరికలు జారీ చేసింది.
సైబర్ దాడులకు వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకొంటున్నప్పటికీ కొత్త కొత్త పద్దతుల ద్వారా దాడులకు నేరగాళ్ళు పాల్పడుతున్నారు. తాజాగా జాక్ పాటింగ్ దాడులకు సైబర్ నేరగాళ్ళు సిద్దమౌతున్నారని ఎటీఎం తయారీలో పేరొందిన డీబోల్డ్ నిక్స్డార్ప్, ఎన్సీఆర్ కార్పోరేషన్ ప్రకటించింది.
అమెరికా సీక్రెట్ సర్వీసెస్ సంస్థ కూడ బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసింది. ఎటీఎంలను లక్ష్యంగా చేసుకొని హ్యకర్లు డబ్బులను డ్రా చేస్తున్నారని సైబర్ సర్వీస్ సంస్థలు హెచ్చరించాయి.
ఎటిఎంలపై జాక్ పాటింగ్ దాడులు
ఎటిఎంలపై జాక్ పాటింగ్ దాడులకు సైబర్ నేరగాళ్ళు పాల్పడుతున్నారని నిపుణులు హెచ్చరించారు. బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తొలిసారిగా ఈ తరహ దాడిని 2013లో మెక్సికోలో గుర్తించారు. ఐరోపా, ఆసియా ఖండాల్లో ఈ తరహ దాడులు చోటు చేసుకొన్నాయి. తాజాగా అమెరికాలో కూడ ఈ తరహ దాడి చేసుకోవడం కలకలం రేపుతోంది.
ఎటిఎం నుండి డబ్బులు దోచుకోవచ్చు
జాక్ పాటింగ్ ద్వారా సైబర్ నేరగాళ్ళు ఎటిఎంలోని డబ్బులను కొల్లగొట్టే అవకాశం ఉంది.ఎటిఎంను పూర్తిగా తమ నియంత్రణలోకి సైబర్ నేరగాళ్ళు తీసుకొంటారు. అయితే సాధారణ కష్టమర్లకు మాత్రం ఎటిఎంలు పనిచేయకుండా కన్పిస్తాయి. కానీ, ఈ ఎటీఎంను తమ నియంత్రణలోకి తీసుకొన్న నేరగాళ్ళు ఎటీఎం నుండి అందినకాడికి దోచుకొంటారు.
జాక్ పాటింగ్ ఎలా చేస్తారు
వైద్య రంగంలో ఎండోస్కోపి తరహ పద్దతిలోనే సైబర్ నేరగాళ్ళు ఎటిఎంలపై దాడులు చేస్తారు. వైద్య రంగంలో వైద్యులు ఉపయోగించే ఎండోస్కోపి తరహలోనే సన్నని పరికరానికి అవసరమైన మార్పులు చేసి ఎటిఎం యంత్రంలో ప్రవేశపెడతారు.ఈ పరికరం సహయంతో ఎటిఎంలోని సమాచారాన్ని సేకరిస్తారు. దీని సహయంతో ఎటిఎంకు తమకు అనుకూలమైన సాప్ట్ వేర్ లేదా హర్డ్ వేర్ ను అనుసంధానిస్తారు. తర్వాత ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ ద్వారా ఎటిఎం ను ఆపరేట్ చేస్తారు. ఆ సమయంలో ఎటిఎం మీట నొక్కితే జాక్ పాట్ అనే పదం వస్తోంది. తద్వారా ఎటిఎం నుండి తమ ఇష్టమొచ్చినట్టు డబ్బులను డ్రా చేసుకొనే అవకాశం సైబర్ నేరగాళ్ళకు దక్కుతోంది.
బ్యాంకర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
జాక్ పాటింగ్ దాడులు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకర్లకు సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఎటిఎంల వద్ద భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.