ఎంహెచ్ 370: ఘటన జరిగిన ఏడాదికి.. ముందు రోజు నివేదిక
కౌలాలంపూర్: గత ఏడాది మార్చి 8వ తేదీన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్ 370 గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఏడాదికి ఒక్కరోజు ముందు దీని పైన నివేదికలు వెలువడనున్నాయి. ఈ విషయమై మలేషియా దేశ ఉప రవాణా శాఖ మంత్రి అబ్దుల్ అజీజ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు.
ఎంహెచ్ 370 విమాన ప్రమాదం 2014 మార్చి 8న జరిగిందని, ఈ ఘటన పైన మార్చి 7వ తేదీన నివేదికలు వెల్లడవుతాయని మంత్రి చెప్పారు. దీని పైన నివేదిక చాలా పెద్దగా ఉందని ఇన్వెస్టిగేషన్ టీం చెప్పిందని, ఈ నివేదిక వందలాది పేజీలు ఉంటుందని చెప్పారు. ఎంహెచ్ 370 ప్రమాదంలో చనిపోయిన 239 మందిలో భారతీయులు ఐదుగురు.
కాగా, చైనా రాజధాని బీజింగ్కు వెళ్తూ మార్చి 8, 2014న మలేషియా విమానం ఎంహెచ్-370 ఆచూకీ గల్లైంతన విషయం తెలిసిందే. దీని ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఈ విమాన శకలాలు హిందూ మహాసముద్రంలో కనిపించాయని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు స్పష్టంగా ఆచూకీ తెలియరాలేదు.
ఇటీవల ఎయిర్ ఏషియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అంతకుముందు ఎంహెచ్ 370 గల్లంతైనప్పుడు ఎయిర్ ఏషియా ఓ ప్రకటన చేసింది. అది ఇటీవల ఎయిర్ ఏషియా కూలినప్పుడు చర్చనీయాంశమైంది.
మార్చిలో ఎంహెచ్ 370 విమానం గల్లంతైంది. ఆ తర్వాత నెలలో అంటే ఆ విమానం గల్లంతైన ఆరు వారాల తర్వాత ఎయిర్ ఏషియా ఓ ప్రకటన చేసింది. తమ పైలట్ ప్రయాణీకులను సురక్షితంగా తీసుకు వస్తాడని, తమ విమానాల్లో ప్రయాణించే వారు ఎటువంటి భయం చెందవలసిన అవసరం లేదని దాని సారాంశం. ఆ ప్రకటన చేసిన ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలింది.
అయితే, అలాంటి సమయంలో ఎయిర్ ఏషియా ప్రకటన పైన విమర్శలు వచ్చాయి. ఎయిర్ ఏషియా కూడా దాని పైన ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. తాము ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నామని ఎయిర్ ఏషియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాతుక్ మెరనన్ ఆ తర్వాత చెప్పారు.