బలమైన వస్తువుల తాకిడి వల్లే కూలిన ఎమ్హెచ్ 17
హైదరాబాద్: కూలిపోయిన మలేషియా విమానం MH 17పై ప్రాధమిక నివేదికను మంగళవారం డచ్ నిపుణులు విడుదల చేశారు. నివేదిక ప్రకారం ఆ 'క్షిపణి అని స్ఫష్టంగా పేర్కొనకపోయినప్పటికీ.. అత్యంత శక్తివంతమైన వస్తువు బయటి నుండి విమానాన్ని ఢీ కొట్టిందని దీంతో విమానం నేలకు పడిపోయింది' అని పేర్కొంది. అంతే కాకుండా ఈ సంఘటన వెనుక మానవ లేదా సాంకేతిక తప్పిదం లేదని చెప్పింది.
నిపుణులు బృందం ప్రాధమిక నివేదిక కోసం బ్లాక్ బాక్స్, ఉపగ్రహ చిత్రాలు, ఫోటోలను ఆధారాలుగా సమీకరించారు. విమానం క్రింద పడిపోయేంత వరకు కాక్ పిట్ వాయిస్ డేటా రికార్డర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిగ్నల్స్ సక్రమంగానే పనిచేశాయని నివేదికలో పేర్కొంది. విమానం శిధిలమైన సమయంలో రెండు ముక్కులుగా విరిగిపోయిందని నివేదిక తెలిపింది.
జులై 17న అమస్టర్ డామ్ నుండి మలేషియా రాజధాని కౌలాలంపూర్కు బయలుదేరిన ఈ విమానాన్ని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు ఉక్రెయిన్ సరిహద్దులో కూల్చివేశారని వార్తలు వచ్చాయి. ఐతే విమాన కూల్చివేతతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. తమ సైనిక దళాలు గగనతలంలోకి ఎటువంటి కాల్పులు జరపలేదని రష్యా స్పష్టం చేసింది. విమానం కూల్చివేతపై ఉక్రెయిన్ తిరుగుబాటుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రష్యాతో తయారైన క్షిపణి వల్లే ఈ విమానం కూలినట్లు ఉక్రెయిన్ హోం మంత్రి ఆన్టోన్ తెలిపారు. విమానం 10వేల మీటర్ల ఎత్తులో ఉండగా రష్యా దాన్ని క్షిపణితో కూల్చేసిందన్నారు.
మలేషియా విమానం MH 17 విమానం కూల్చివేత ఘటనలో ఇంకా 21మంది మృతులను గుర్తించాల్సి ఉందని మలేషియా ప్రకటించింది. ఈ విమానంలో ప్రయాణించి మరణించినవారిలో నెదర్లాండ్స్కు చెందిన వారు 173 మంది, మలేషియా కుచెందిన వారు 44మంది, ఆస్ట్రేలియాకు చెందిన వారు 27 మంది, ఇండోనేషియాకు చెందిన వారు 12 మంది ఉన్నారని మలేషియా ప్రకటించింది.