అల్లుడిపై స్పందించిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిషికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తన అల్లుడి విజయంపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి మాట్లాడారు. బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన రిషిసునాక్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనపట్ల తాను చాలా గర్వంగా ఉన్నానని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
గ్రేట్ బ్రిటన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారనే నమ్మకం ఉందన్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నారాయణమూర్తి కుమార్తె అక్షతామూర్తి ఎంబీఏ చదివే సమయంలో రిషితో పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరి మనసులు కలవడం, పెద్దలు కూడా అంగీకరించడంతో వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
బోరిస్ జాన్సన్ రాజీనామాతో బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ 45 రోజుల అతి తక్కువ సమయంలోనే పదవికి రాజీనామా చేశారు. మూడు నెలల వ్యవధిలోనే బ్రిటన్ మూడో ప్రధానిని చూసింది. తర్వాత రిషి సునాక్ కు ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన గ్రేట్ బ్రిటన్ ప్రజలు తాజాగా రిషి సునాక్ పై ఆశలు పెంచుకున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దేశవ్యాప్తంగా సమ్మెలు, ఉక్రెయిన్ తో రష్యా యుద్ధంలాంటి సవాళ్లు రిషికి సవాల్ గా నిలుస్తున్నాయి.
ద్రవ్యోల్బణం 10 శాతానికి మించి పెరుగుతుండటంతో చమురు ధరలు, ఆహార ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సంపాదన తగ్గుతుండటం.. జీవన వ్యయం పెరుగుతుండటతో అక్కడి పౌరులు ఆందోళనకు గురవుతున్నారు. లిజ్ ట్రస్ మినీ బడ్జెట్ తో పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నించినప్పటికీ అది బెడిసికొట్టి ఆమె పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రజలను శాంతింపచేయడంతోపాటు మార్కెట్లను కూడా శాంతపరచాలి.. అక్కడి ప్రజల్లో విశ్వసాన్ని పాదుకొల్పడమే రిషి సునాక్ ముందున్న అసలై్ సవాల్.