కాన్సస్ ఘటనపై ట్రంప్ మౌనం: కూలుతున్న భారత యువత ఆశాసౌధం
కాన్సస్ సిటీలో శ్రీనివాస్ కూచిభొట్ల కాల్చివేత ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మౌనం పట్ల కేంద్ర ప్రభుత్వ అధికారులు సైతం షాక్కు గురయ్యారు.
న్యూఢిల్లీ/ వాషింగ్టన్: కాన్సస్ సిటీలో శ్రీనివాస్ కూచిభొట్ల కాల్చివేత ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మౌనం పట్ల కేంద్ర ప్రభుత్వ అధికారులు సైతం షాక్కు గురయ్యారు. ఈ ఘటనతో ట్రంప్ సిద్ధాంతానికి సంబంధం లేదన్న ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.
కాన్సస్ ఘటనను ఖండించిన వైట్ హౌస్ కార్యదర్శి సియాన్ స్పైసర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ సిద్ధాంతానికి, ఈ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దీనిపై ఇంతకుమించి చెప్పేదేమీ లేదన్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నా ఎవరూ స్పందించడం లేదు. కొందరు మాత్రం ఆయన మౌనం పట్ల ఎటువంటి ఆశ్చర్యానికి గురి కావడం లేదు. ఇంతకంటే ఆయన ఏం చెప్తారని అంటున్నారు. భారతీయుల్లో సహజంగానే ఆశ్చర్యం వెల్లువెత్తుతున్నది.
అమెరికాలో గణనీయంగా ఉన్న ఇండో అమెరికన్లు అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కార్యదర్శి జోన్ ఫవ్రెవౌ స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్నా, బుష్ ఉన్న ద్వేషపూరిత, జాతి వివక్షా పూరిత చర్యలను ఖండించే వారన్నారు. అయితే మీడియా, ఎఫ్ బిఐతో ఇబ్బందుల వల్ల ట్రంప్ ఘటనపై ఖండన చేసేందుకు ముందకు రాలేక, ప్రెస్ కార్యదర్శితో ఖండింపజేశారని పేర్కొన్నారు. కానీ ఇంత కంటే మెరుగ్గా స్పందించాల్సిందన్నారు.
కలలపై యువత ఇలా..
అమెరికా తమకు స్వర్గధామమని, ఆ దేశంలో అడుగుపెట్టడమే తమ కల అని యువత చెప్పుకునేవాళ్లు. కానీ మారుతున్న పరిస్థితులు వారిలో అమెరికాపై ఉన్న దృక్పథాన్ని మార్చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక వలసలపై తీవ్రమైన ఆంక్షలు విధించడం, యూనివర్సిటీల్లోనూ భారతీయులపై వివక్ష పెరుగడం.. వీటికీ మించి శ్రీనివాస్ కూచిభొట్ల కాల్చివేత ఘటన యువత కలల సౌధం నుంచి అమెరికా చెరిగి పోతున్నది. ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాను ఎంచుకునే విషయమై చాలామంది విద్యార్థులు పునరాలోచిస్తున్నారు. దీంతో ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఇతర ప్రత్యామ్నాయాలపై విద్యార్థుల చూపు
ఢిల్లీ ఐఐటీ విద్యార్థి అనుపమ్సింగ్ మిగతా వారి మాదిరిగే అమెరికా కలలు కన్నాడు. పీజీ పూర్తయ్యాక పీహెచ్డీ కోసం అమెరికాకు వెళ్లాలని భావిస్తూ వచ్చాడు, కానీ కాన్సస్లో కాల్పుల ఘటన తర్వాత అమెరికాపై అతడి ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. విదేశీ విద్యార్థులు చదువుకోవడానికి అమెరికా ఏమాత్రం సురక్షితమైన ప్రాంతం కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ట్రంప్ హయాంలో విద్వేష ఘటనలు మరిన్ని చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని భారతీయులు అమెరికా కలలు వీడాలని సూచించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులు ఎవరూ తమ పిల్లల్ని అమెరికా పంపవద్దని కాన్సస్ ఘటనలో గాయపడిన అలోక్ తండ్రి అర్థించడం అందరినీ కలచివేసింది. కన్సల్టెన్సీ సంస్థలు మాత్రం పరిస్థితి తాత్కాలికమైనదేనని తర్వలోనే చక్కబడుతాయని పేర్కొంటున్నాయి.
ఇండియన్ల పరిరక్షణే ధ్యేయమన్న సిక్కు నేత
అమెరికాలోని భారతీయులంతా ఐకమత్యంతో ఉండాలని సిక్కు పొలిటికల్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక చైర్మన్, ఎన్నారై సిక్కు నేత గురిందర్ సింగ్ ఖల్సా పిలుపునిచ్చారు. కాన్సస్ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. అమెరికాలో ఉన్న ప్రతి భారతీయుడిని రక్షించుకోవడమే తమ సంస్థ ప్రథమ ప్రాధాన్యమన్నారు.
విచారణకు మిస్సోరి గవర్నర్ రిస్ గ్రీటెన్స్ ఆదేశం
మతిలేని హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేదిలేదని కాన్సస్ గవర్నర్ శామ్ బ్రౌన్బ్యాక్ స్పష్టం చేశారు. నిందితుడు కాల్పులు జరిపేముందు మా దేశంనుంచి వెళ్లిపోండి అంటూ జాతి విద్వేష వ్యాఖ్యలు చేయడం సహా ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నట్లు మిస్సోరి గవర్నర్ రిస్ గ్రీటెన్స్ తెలిపారు.
అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు అమీబెరా ఇలా
కాన్సస్ ఘటనను ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీబెరా ఖండించారు. అమెరికాలో వివక్ష, విదేశీయత వైముఖ్యం వంటి ఫోబియాకు స్థానంలేదని స్పష్టం చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.