భారత టెక్కీలకు మరో షాక్: ‘వీసా 457’ రద్దు చేస్తున్న ఆస్ట్రేలియా
మెల్బోర్న్/న్యూఢిల్లీ: ఇప్పటికే అమెరికా, సింగపూర్ తదితర దేశాలు భారత సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కు ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా అదేబాటలో నడిచేందుకు సిద్దమైంది. అసలే, అమెరికాలో సవరించిన హెచ్1బీ వీసాల నిబంధనలపై మంగళవారం ట్రంప్ సంతకం చేయనుండగా.. ఆస్ట్రేలియా కూడా పిడుగులాంటి వార్తతో భారత టెక్కీలకు షాకిచ్చింది.
తాజాగా ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం భారత ఐటీ కంపెనీలకు ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేమంటే.. విదేశీయులకు ఉద్యోగాలు కల్పించే కీలక వీసా విధానం 'వీసా 457'ను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని టర్న్బుల్ ప్రకటించారు. దీని ప్రభావం 95,000 వీసాలపై పడనుంది.
కాగా, ఈ వీసాలను అత్యధికంగా భారతీయులే వినియోగిస్తుంటారు. దీంతో భారతీయ ఉద్యోగులపై దీని ప్రభావం ఎక్కువగా పడే అవకాశం కనిపిస్తోంది. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని అదుపు చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ కీలక విధానాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది.
ఉద్యోగాల్లో ఆస్ట్రేలియన్లకే తొలి ప్రాధాన్యమిచ్చేలా చేయడమే దీని లక్ష్యమని ఆ దేశ ప్రభుత్వాధినేత టర్నబుల్ పరోక్ష సంకేతాలిచ్చారు. ఆయన తన ఫేస్బుక్లో ఈ విషయాన్ని పేర్కొనడం గమనార్హం. తమ సంస్కరణలు ఆస్ట్రేలియా ఉద్యోగాలు.. ఆస్ట్రేలియా విలువపైనే దృష్టి పెట్టాయని వివరించారు. అయితే ప్రభుత్వం విదేశీ ఉద్యోగులను దూరం చేసుకోదన్నారు. నిపుణులకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.