దిక్సూచిలా రాహుల్.. ప్రశంసలు కురిపించిన రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలకు రాహుల్గాంధీ దిక్సూచిలా కనిపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ సృష్టిస్తున్న గందరగోళం నుంచి ప్రజలకు విముక్తి కల్గించడానికి భారత్ జోడో యాత్ర చేపట్టారని చెప్పారు. దేశ ప్రజలు రాహుల్లో ఒక పరిణితి చెందిన నేతను చూస్తున్నారని పేర్కొన్నారు.
దేశ విశాల ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడం ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. రోజు పాదయాత్రతో వివిధ వర్గాల ప్రజలు వచ్చి కలుస్తున్నారని చెప్పారు. ప్రజలు రాహుల్ గాంధీని ఒక పరిష్కార మార్గంగా భావిస్తున్నారని రేవంత్ తెలిపారు. గత నెల 23 నుంచి తెలంగాణలో కొనసాగుతున్న జోడో యాత్ర సోమవారంతో దిగ్విజయంగా ముగియనుందని తెలిపారు.
భారత్ జోడో యాత్ర క్విట్ ఇండియా ఉద్యమం సరసన నిలుస్తోందని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో యువత, వృద్ధులు, మహిళలు రాహుల్తో పోటీపడి నడవడం గొప్ప విషయంగా రేవంత్రెడ్డి అభివర్ణించారు. మోడీ, అమిత్షా, కేసీఆర్ అవలంభిస్తున్న విధానాల వలన దేశ ప్రజలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కులాలు, మతాలు, భాషల పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు అధికారంపై ఉన్న ధ్యాస ప్రజలపై లేదని విమర్శించారు. రాహుల్ పాదయాత్ర చేయకుండా ఈడీ, ఐటీలతో కేంద్రం బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. మోడీ, అమిత్షా రాహుల్ గాంధీని లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేసినా జోడో యాత్ర ఆగలేదని స్పష్టం చేశారు. పాదయాత్ర చేస్తే ప్రాణాలకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా రాహుల్ గాంధీ తన పాదయాత్రను ఆపలేదన్నారు.