దాడులకు అదరం బెదరం, శ్రేణులపై అటాక్.. కేసీఆర్పై షర్మిల విసుర్లు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర కొనసాగుతోంది. 41వ రోజు తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి మండలం కాశి తండాలో పాదయాత్ర ప్రారంభించారు. కాశి తండా నుంచి బోటిమీది తండా, నాగారం మండలంలోని లక్ష్మాపూర్ గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. అనంతరం పాస్తాల క్రాస్ రోడ్ వద్దకు చేరింది. దీంతో ప్రజాప్రస్థానం 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. అనంతరం పాదయాత్ర శాంతినగర్, గోపాలపురం గ్రామాల మీదుగా సాగింది. సాయంత్రం నాగారం మండల కేంద్రంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు.
ఇచ్చిన మాట ప్రకారం 64 లక్షల రైతులకు రుణమాఫీని వైఎస్ఆర్ చేశారని తెలిపారు. ఏకకాలంలో రూ.2 లక్షలు రుణమాఫీ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తొలుత ఆలోచన చేసిన నాయకుడు మన వైయస్ఆర్ అని చెప్పారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారు. మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించారు. పేదింటి బిడ్డలకు ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో ఎన్నో విద్యాసంస్థలు, వర్సిటీలు నెలకొల్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచిత విద్య అందించారు.
కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు. రైతులకు రుణమాఫీ అని, కేజీ టు పీజీ ఉచిత విద్య అని మోసం చేశారు. మూడెకరాల భూమి ఇస్తానని దళితుల్ని దగా చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని మోసం చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మోసం చేశారు. 4లక్షల అప్పులు చేసి, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి, లిక్కర్ ఆదాయంతో రాష్ట్రాన్ని నడుపుతున్నారు. ఏడేండ్లలో 3000 బడులను మూసివేశారు. 14000 టీచర్లను తొలగించారు. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోగా.. ప్రైవేటులోనూ ఉద్యోగాలు కల్పించడం లేదు. కేసీఆర్ హయాంలో నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు.