భూదేవికి అవమానం జరిగింది.. వైసీపీ నేతల తీరుపై రఘురామ ఆగ్రహాం
నారా భువనేశ్వరికి జరిగిన అవమానంపై అన్నీ పార్టీల నేతలు, ప్రతినిధులు స్పందిస్తున్నారు. వైసీపీ నేతల తీరును తప్పుపడుతున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా రియాక్ట్ అయ్యారు. భువనేశ్వరికి జరిగిన అవమానం భూదేవికి జరిగినట్లేనని రఘురామకృష్ణరాజు కామెంట్ చేశారు. వైసీపీ నేతల నీచపు మాటలతో నందమూరి కుటుంబం ఎంత తల్లడిల్లిపోయిందో చూశామని అన్నారు. అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటన కేవలం ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించినది కాదని... మొత్తం తెలుగుజాతికి జరిగిన అవమానమని చెప్పారు.
అందరూ ఒక్కటే
మీ ఇళ్లలో ఆడవాళ్ల గురించి మాట్లాడితే మీరు ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ అనే వ్యక్తి తెలుగుజాతి సంపద అని... ఆయనను కుటుంబ పెద్దగా భావించాలని చెప్పారు. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలోని మహిళలంతా ఏకమై ముందుకు కదలాలని అన్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసు గురించి మాట్లాడకుండా... మొత్తం వ్యవహారాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆడపడుచులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన తెలిపారు. ఏదైనా ఉంటే నేతలపై కామెంట్ చేయడం జరుగుతుందన్నారు. కానీ ఆడవాళ్ల విషయం తీయడం మాత్రం హర్షించదగిన పరిణామం కాదన్నారు.
సరికాదు
అంతకుముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. అసెంబ్లీలో తన సోదరి నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు దూషించారనే ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇదీ హర్షించదగిన పరిణామం కాదని వివరించారు. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా జరిగిన ఘటనతో తన మనసు నిజంగా గాయపడిందని పురందేశ్వరి అన్నారు. అక్కాచెల్లెళ్లుగా ఎన్నో విలువలతో పెరిగాం అని చెప్పారు. ఈ ఘటనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలను అందరూ గమనిస్తున్నారని వివరించారు. అధికార మదంతో ఇలా వ్యవహరించడం సరికాదని కామెంట్ చేశారు.
విలువలు లేవా..?
ఏపీ శాసన సభలో సభ్యులు వ్యవహరించిన తీరు సరైన విధానం కాదని, ఏ పార్టీ వారైనా హద్దులు దాటి, అసభ్య పదజాలంతో విమర్శలు చేసుకోవడం అత్యున్నత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక విలువలను పతనం చేయడమేనని అభిప్రాయాలు వస్తున్నాయి. ఉన్నత విలువలతో ప్రజా సమస్యలపై చర్చలకు వేదికగా నిలవాల్సిన చోట ఇలాంటి పరిణామాలు జరగడం శోచనీయమన్నారు. వ్యక్తిత్వం లేని వారిని చట్టసభలకు పంపితే పరిణామాలు ఇలానే వుంటాయన్నారు.