బోరు బావిలో పడిన మూడేళ్ల బాలుడు: కాపాడేందుకు రంగంలోకి సహాయక బృందాలు
మెదక్: జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో శనివారం ఉదయం మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు తాగునీటి బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు, 108 సిబ్బంది బాలుడ్ని కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన కుమ్మరి రాములు అనే రైతు శనివారం తెల్లవారుజామున బోరు వేయగా అందులో నీరు రాలేదు. బోరు బావిపై మూత వేయకుండా అలాగే వదిలేసి వెళ్లిపోయాడు. సాయిలు ఇంటికి వంద మీటర్ల దూరంలో ఈ బోరు బావి ఉంది.
శనివారం ఉదయం సాయిలు కుమారుడు రాకేశ్(3) ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయాడు. తమ కొడుకు బోరుబావిలో పడటం కళ్లారా చూశామని తల్లిదండ్రులు మొగులమ్మ, సాయిలు చెబుతున్నారు.
సమాచారం తెలిసిన వెంటనే స్థానిక ఎస్సై సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం కూడా బాలుడ్ని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
బాలుడ్ని కాపాడేందుకు సహాయక సిబ్బంది ప్రొక్లెనయిన్ సహాయంతో బావి చుట్టూ భూమిని తవ్వుతున్నారు. దాదాపు 140అడుగుల లోతులో ఉన్న ఈ బోరుబావిలో పడిన బాలుడికి ఆక్సిజన్ అందించేందుకు 108 సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అయితే అతడు ఎంత లోతులో ఉన్నది తెలియడంలో లేదు.