కూతుళ్లపై రేప్ చేసిన తండ్రికి జైలు:ఇంట్లో మరుగుదొడ్డి లేదని విద్యార్ధిని ఆత్మహత్య
హైదరాబాద్: మైనర్ కూతళ్లపై అత్యాచారం చేసిన కేసులో తండ్రి ఎండీ రహీంకు నాంపల్లి క్రిమినల్ కోర్టు యావజ్జీవ కారాగారవాస జైలు శిక్ష విధించింది. రహీం రాజ్భవన్లో మాజీ ఉద్యోగి. ఆయన మైనర్ కూతుళ్లపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించమని గత కొన్ని రోజులుగా తల్లిందండ్రులతో మొరపెట్టుకుంటున్నా, వారు పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్ధిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆగ్నికి ఆహుతైంది.
ఈ సంఘటన నల్లగొండ జిల్లాలోని గుండాల మండల కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కొడపర్తి సత్తయ్య, నాగమ్మల కూతురు కొడపర్తి రేఖ(17) స్థానిక కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో ఆరు బయట మల విసర్జనకు వెళ్లాల్సి వస్తోందని, త్వరగా ఇంట్లో మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాలని గత కొన్ని రోజులుగా తల్లిదండ్రులతో గొడవ పడుతోంది. అయినప్పటికీ తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.
సోమవారం ఉదయం విద్యార్ధిని తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిన అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే విద్యార్ధని శరీరం 90 శాతం కాలిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది.
దీంతో గుండాలలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. వెంటనే విషయాన్ని తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతేదేహాన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. తమ కుమార్తెను చేజేతులా తామే చంపుకున్నామంటూ విద్యార్ధిని తల్లిదండ్రులు రోదించడం, అక్కడున్న వారందరిని కలచివేసింది.