కాంగ్రెస్ శకునిలా.. టీడీపీ శిఖండిలా.. : హరీశ్, హరితహారానికి కేసీఆర్ డేట్ ఫిక్స్
మెదక్ : తెలంగాణలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు అంశం టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్య వివాదాన్ని రాజేస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు ద్వారా ముంపు గ్రామాల నిర్వాసితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తుండగా.. ఆ ఆరోపణలను తిప్పికొడుతూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.
తాజాగా మల్లన్న సాగర్ అంశంపై స్పందిస్తూ ప్రతిపక్షాలను కడిగిపారేశారు మంత్రి హరీశ్ రావు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. 'ప్రాజెక్టులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ శకునిలా వ్యవహరిస్తోందని, అలాగే టీడీపీ శిఖండి పాత్రను పోషిస్తున్నాయని' ఆగ్రహం వ్యక్తం చేశారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టు నిర్మాణం ద్వారా మెదక్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పిన హరీశ్ రావు, తద్వారా జిల్లా రైతాంగం బతుకులు బాగుపడుతాయని అన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును మెదక్ ప్రజల తలరాతలు మార్చేదిగా అభివర్ణించిన ఆయన, ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వినియోగంలోకి వస్తే జిల్లా రైతాంగానికి సాగునీరు అందుబాటులోకి వస్తుందని, ఫలితంగా రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ సాధ్యపడుతుందన్నారు.
ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. సింగూరు పులిచింతల, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ప్రజలను ముంచారే తప్ప తెలంగాణాలో ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. సరైన నిర్ణయాలతో కేసీఆర్ పాలన సాగుతుంటే కాంగ్రెస్ టీడీపీలు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
చివరగా, ఆయన మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లలో దుబ్బాక నియోజక వర్గ అభివృద్ది కోసం రూ.1000 కోట్ల వరకు మంజూరు చేసినట్టు తెలిపారు.
హరితహారానికి కేసీఆర్ డేట్ ఫిక్స్
రెండో విడుత హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని హరిత వనంగా మార్చేందుకు సన్నద్దమవుతోంది. హరితహారం ఆచరణకు సంబంధించి ఇప్పటికే పలు సరికొత్త ప్రణాలికలను రూపొందించిన ప్రభుత్వం ఆచరణలో దీన్నో ప్రజా ఉద్యమంలా జనంలోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది.
ఇకపోతే రెండో విడుత హరితహారానికి సంబంధించి ప్రభుత్వ కార్యచరణ ఖరారైనట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8వ తేదీన సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం ఈ రెండో విడుత హరితహారం ప్రారంబానికి వేదిక కానున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే, హరితహారం కార్యచరణలో భాగంగా.. హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారికి ఇరువైపులా పూల చెట్లు, నీడనిచ్చే మొక్కలు నాటాలని నిర్ణయించింది ప్రభుత్వం. సుమారు 165 కి.మీ మేర నాటే ఈ మొక్కల ద్వారా హైదరాబాద్-విజయవాడ రహదారి ఆకుపచ్చ శోభను సంతరించుకోబోతుంది.