కోర్టుకు: తెరాసపై డిగ్గీ, ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ భార్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హానీమూన్ కాలం ముగిసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ మంగళవారం అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోందని, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడుగా వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు కోసం న్యాయపోరాటం చేస్తామన్నారు. వారిని రాజీనామా చేసేలా ఆ నేతల ఇల్ల ముందు నిరసన చేపట్టాలని కోరారు. పార్టీ ఫిరాయించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పోరేటర్ల పైన అనర్హత వేటు వేయని కలెక్టర్ల పైన కోర్టులో కేసులు వేయాలని నిర్ణయించామన్నారు. డిగ్గీ పీసీసీ సమన్వయ భేటీలో మాట్లాడారు.
నేతలు విభేదాలు మాని కలిసికట్టుగా పని చేయాలని దిగ్విజయ్ సింగ్ నేతలకు సూచించారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. జీహెచ్ఎంసి, ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ను నేతలే గెలిపించాలని ఆయన స్పష్టం చేశారు.
యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ సతీమణి
కేసీఆర్ సతీమణి శోభ జ్వరంతో బాధపడుతూ.. యశోద ఆసుపత్రిలో చేరారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల జ్వరం వచ్చి ఉంటుందంటున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు దూరం: అసద్
వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మజ్లిస్ పార్టీ దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్టీ బలంగా లేదని, బూత్ లెవల్ క్యాడర్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఢిల్లీలో అతి త్వరలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అలాగే ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి మద్దతివ్వడం లేదన్నారు. సెక్యులర్, సంక్షేమం కోసం పని చేసే అభ్యర్థులను గెలిపించాలన్నారు.