వచ్చే నెలలో వరల్డ్ ఐటీ కాంగ్రెస్... మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదికకానున్న భాగ్యనగరం
హైదరాబాద్: అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు మూడు రోజులపాటు వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డబ్ల్యూసీఐటీ) సదస్సును హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించనున్నారు.
2017 నవంబర్ నెల చివరి వారంలో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సదస్సుకు హైదరాబాద్ వేదికగా మారిన సంగతి తెలిసిందే. తొలిసారి భారత్లో.. అదీ మన భాగ్యనగరంలో జరిగిన ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.
మరో అంతర్జాతీయ సదస్సు...
‘యాంప్లిఫై డిజిటల్-డిస్రప్ట్ ద కోర్' అనే థీమ్తో ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్, భారతదేశానికి చెందిన ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల వేదికైన నాస్కామ్ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
80 దేశాల నుంచి 2500 మంది ప్రతినిధులు...
డబ్ల్యూసీఐటీ సదస్సులో 80 ప్రధాన దేశాలకు చెందిన 2,500 మంది ప్రతినిధులతోపాటు, కేంద్రమంత్రులు పాల్గొననున్నారు. ఈ సదస్సును భారత్లో నిర్వహించడం ఇదే తొలిసారి. వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్ ఆధ్వర్యంలో 1978లో తొలిసారిగా డబ్ల్యూసీఐటీ సదస్సు జరిగింది. 2016లో బ్రెజిల్లో, 2017లో తైవాన్లో నిర్వహించారు. ఈ ఏడాది ఈ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది.
ఈ సదస్సు ఎందుకంటే...
టెక్నాలజీ రంగంలో ప్రాథమిక ఆవిష్కరణల కాలం ముగిసిపోయి డిజిటల్ ఆవిష్కరణల కాలం మొదలైంది. రాబోయే తరాన్ని నిర్దేశించే డిజిటల్ ఆవిష్కరణల కోసం ఐటీ, ఐటీ అనుబంధ, బ్యాంకింగ్, ఇతర ఆర్థికరంగ సేవలు, రిటైల్, ఆటోమొబైల్ రంగాల్లో అన్వేషణ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు.. ప్రజలకు తమ సేవలు అందించేందుకు పాతకాలపు విధానాలను పక్కనపెట్టి సాంకేతికత ఆధారిత సేవలు అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేగం, ఖచ్చితత్వం, పారదర్శకత వంటివాటితో భౌతిక, వర్చ్యువల్ సమస్యలకు పరిష్కారం చూపించాల్సి ఉంటుంది.
ఈ సదస్సులో ఏం చేస్తారు?
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ విభాగంలో ప్రాధాన్యం గల వేదికగా డబ్ల్యూసీఐటీ నిలుస్తోంది. దాదాపుగా 80 ప్రధాన దేశాలకు చెందిన 2,500 మందికి పైగా ప్రముఖులు, దిగ్గజ సంస్థల ప్రతినిధులు, విద్యాసంస్థల ప్రతినిధులను ఒకే వేదికపై తీసుకొస్తోంది. భారతదేశంలో నిర్వహిస్తున్న అత్యున్నత లీడర్షిప్ ప్రోగ్రాం అనే గుర్తింపును నాస్కామ్ పొందింది. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు, వ్యూహాలు, వ్యాపార ప్రణాళికలు, భవిష్యత్ సవాళ్లు- ఎదుర్కోవాల్సిన విధానాలు వంటివి ఈ సదస్సు వేదికగా చర్చిస్తారు. మూడురోజుల ఈ సదస్సులో వివరణాత్మకమైన ప్రసంగాలు, ప్రదర్శనలు, బృంద చర్చలు, నెట్వర్కింగ్ వంటివి ప్రధానంగా ఉంటాయి.
కీలక చర్చలు.. వీళ్లే వక్తలు...
డిజిటల్ భవిష్యత్ను సాకారం చేసేందుకు ఈ సదస్సు వేదికగా కీలక చర్చలు జరగనున్నాయి. ఈ సదస్సులో ప్రసంగించనున్నవారిలో మౌనిర్జాక్ (అమెరికా ఒలింపిక్ కమిటీ), మైకెల్గోరిజ్ (స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్), ఎడ్మాన్సర్ (ఎమర్సన్ ఎలక్ట్రికల్), ఆండ్య్రూహార్టన్ (బ్రిటిష్కౌన్సిల్), స్కాట్ సాండ్శ్కాపర్ (నోవార్టీస్), శ్రీనివాసన్ ఏటీ (ఖతార్ ఎయిర్వేస్), జగ్గీ వాసుదేవ్ (ఇషా ఫౌండేషన్), పుల్లెల గోపీచంద్ (బ్యాడ్మింటన్ కోచ్) తదితరులు ఉన్నారు.