షాకింగ్: పట్టపగలు.. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగా.. విద్యార్థిని నరికి చంపేశారు!
హైదరాబాద్: కొంతమంది దుండగులు బస్సులో ప్రయాణిస్తోన్న ఓ విద్యార్థిని చొక్కా పట్టుకుని కిందికి లాగి, పట్టపగలే నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే వేటకొడవళ్లతో నరికి చంపారు. సోమవారం కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఎదుటే జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
మృతుడు మూసాపేటకు చెందిన ఎర్రగళ్ల సుధీర్(17)గా చెబుతున్నారు. ఇతడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం ఇంటర్ పరీక్ష రాసేందుకు బస్సులో వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నలుగురు దుండగులు సుధీర్ను బస్సులోంచి బలవంతంగా కిందికి లాగారు. బస్సు నుంచి దిగిన సుధీర్ వారినుంచి తప్పించుకుని రోడ్డుపై పరిగెత్తాడు. అయినా వారు వదలకుండా అతడ్ని వెంటాడి కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఎదుట నడిరోడ్డుపైనే వేటకొడవళ్లతో నరికి చంపారు.
ఈ ఘటనలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన సుధీర్ అక్కడికక్కడే ప్రాణం విడిచినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఆ నలుగురు దుండగుల్లో ఒకడిని స్థానికులు పట్టుకోగా మరో ముగ్గురు పరారయ్యారు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడ్ని అదుపులోకి తీసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
స్నేహితులతో జరిగిన వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుధీర్ స్నేహితులైన నవీన్, కృష్ణ, మహీ, తేజ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధీర్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు జరుపుతున్నారు.