లక్షన్నర ఖర్చు!: బంగారం అమ్మి బాంబులు తయారు చేసిన ఉగ్రవాది
హైదరాబాద్: హైదరాబాద్లో బాంబు పేలుళ్లకు ఐసిస్ పన్నిన ఉగ్రకట్రలపై ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన సానుభూతిపరుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడతున్నాయి. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న ఇబ్రహీం యాజ్దానీ, ఇలియాజ్ యాజ్దానీ, హాబీబ్ మహ్మద్, అబ్దుల్లా బిన్ అహ్మద్, ముజఫర్ హూసేన్ రిజ్వాన్లను అధికారులు విచారిస్తున్నారు.
ఈ విచారణలో తాజాగా అతావుల్లా రహ్మాన్, నియామతుల్లా హూసేన్ పేర్లు వెల్లడి కావడంతో వారిని కూడా ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. దీంతో నగరంలో పట్టుబడ్డ ఐఎస్ సానుభూతిపరుల సంఖ్య ఏడుకు చేరింది. ప్రస్తుతం ఎన్ఐఏ ఇబ్రహీం యాజ్దానీ, ఇలియాజ్ యాజ్దానీ, అతావుల్లా రహ్మాన్, నియామతుల్లా హూసేన్లను రెండోదశ కస్టడీలో విచారిస్తున్నారు.
హైదరాబాద్ లో బాంబు పేలుళ్ల కోసం సిరియాలోని ఐఎస్ నాయకుడి నుంచి డబ్బులు వస్తాయని ఉగ్రవాది ఇబ్రహీం ఆశించనప్పటికీ ఆ సాయం అందలేదు. దీంతో, ఇబ్రహీం తన సొంత బంగారాన్ని అమ్మేసి దాదాపు లక్షన్నర రూపాయలతో బాంబుల తయారీకి అవసరమైన పేలుడు పదార్థాలు, తుపాకులను కొనుగోలు చేశాడని ఎన్ఐఏ అధికారుల విచారణలో తెలిసింది.
దీంతో పాటు తుపాకులను కూడా కోనుగోలు చేసి పేలుళ్ళకు తన గ్యాంగ్ను సిద్ధం చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. నగరంలో పలు ప్రాంతాల్లో విధ్వంసాలను సృష్టించేందుకు ఓ భారీ పథకాన్ని రచించారు. ఇబ్రహీం గ్యాంగ్కు సిరియాలోని ఐఎస్ నాయకులు ఎప్పటికప్పుడు సూచనలు చేసేవారని తెలిసింది.
హైదరాబాద్లో పేలుళ్ళ నిమిత్తం ఇబ్రహీం గ్యాంగ్కు ఇటీవలే సౌదీ నుంచి ఏడువేల రియాల్లు అందినట్టు తెలిసింది. అంటే మన కరెన్సిలో 18 వేల రుపాయలు. ఈ సౌదీ కరెన్సీ ఇబ్రహీం గ్యాంగ్కు ఏ విధంగా చేరిందనే దానిపై ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించారు.
ఇబ్రహీం గ్యాంగ్ ఈ నగదుతో బాంబులు తయారీకి కావాల్సిన మరికొన్ని పేలుడు పదార్థాలతో పాటు సెల్ఫోన్లు, సిమ్ కార్డులు, పెన్డ్రైవ్లు కోనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.