తెరపైకి ఓటుకు నోటు.. 'గ్రేటర్' తర్వాత కెసిఆర్ ప్రతీకారం: ఫోన్ ట్యాపింగ్ లేవనెత్తిన మత్తయ్య
హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి ఏసీబీ అధికారులు తనకు నోటీసులు ఇవ్వడం తగదని ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య శనివారం నాడు చెప్పాడు. ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు స్టేను ధిక్కరించి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారన్నాడు.
కేవలం పోలీసుల విధులకు ఆటంకం కలిగించవద్దనే నోటీసులు తీసుకున్నట్లు చెప్పాడు. ఏసీబీ విచారణకు హాజరయ్యే ప్రసక్తే లేదని చెప్పాడు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని చెప్పాడు.
అందులో భాగంగానే ఈ నోటీసులను పంపించారని ఆరోపించాడు. ఏపీలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా విచారణ జరిపించి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ పోలీసులు తనకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరాడు.
కాగా, ఓటుకు నోటు కేసు మరోమారు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న జెరూసలేం మత్తయ్యని తమ ఎదుట హాజరు కావాల్సిందిగా కోరుతూ తెలంగాణ ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డి శనివారం నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో తమ ఎదుట హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
మండలి ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేసేలా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ను ప్రలోభపెట్టారన్న ఆరోపణలపై గతేడాది మే 31న అవినీతి నిరోధకశాఖ అధికారులు టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, అతని అనుచరుడు ఉదయ్ సిన్హాలను, ఆ తర్వాత టిడిపి మరో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న సెబాస్టియన్ను అరెస్టు చేశారు.
తదుపరి దర్యాప్తులో జెరూసలేం మత్తయ్య అనే వ్యక్తి టిడిపికి అనుకూలంగా ఓటువేసేలా తొలుత స్టీఫెన్ సన్ను సంప్రదించినట్లు తేలింది. దీంతో జెరూసలేం మత్తయ్య కోసం గాలింపు మొదలుపెట్టారు. విజయవాడ చేరుకున్న మత్తయ్య తెలంగాణ సీఎం కేసీఆర్ తదితరులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసింది.
తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మత్తయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు మత్తయ్యను అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు రేవంత్ రెడ్డి తదితరులపై జులైలోనే ఏసీబీ అభియోగాలు దాఖలు చేసింది.
తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఓటుకు నోటు కేసు ఇంచుమించు మరుగున పడిపోయింది. ఇప్పుడు శనివారం ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డి పేరుతో మత్తయ్యకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ)లోని సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు.
ఈ కేసుకు సంబంధించి వాస్తవాలు, అప్పటి పరిస్థితులు మీకు తెలిసి ఉంటాయని భావిస్తున్నామని, వీటిని విచారించేందుకు తమ ఎదుట హాజరుకావాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో అరెస్టు చేయబోమని కూడా లేఖలో స్పష్టం చేశారు. లేఖ అందిన తర్వాత వారం రోజుల వ్యవధిలో దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని పేర్కొన్నారు.