25కోట్లతో కాకతీయ ఉత్సవాలు:అతిథిగా బస్తర్ రాజు
హైదరాబాద్/వరంగల్: కాకతీయ సామ్రాజ్యపు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా కాకతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఫిబ్రవరి లేదా మార్చి మాసంలో కాకతీయ ఉత్సవాలను రూ.25 కోట్లతో ఘనంగా నిర్వహిస్తామని, వీటికి సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. ఈ ఉత్సవాలను వరంగల్కే పరిమితం చేయకుండా తెలంగాణ పది జిల్లాల్లోనూ జరిపిస్తామన్నారు.
లక్నవరం, రామప్ప, ఘణపురం, పాకాలలాంటి చెరువులను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ఉత్సవాల సందర్భంగా రెజ్లింగ్ పోటీలు, పడవ పందాలు నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలని అన్నారు. విద్యార్థులకు సాంస్కృతిక, సాహిత్య అంశాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
కళాకారులు, క్రీడాకారులు, డాక్టర్లు, చరిత్రకారులు ఇలా అందరికీ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, కవి సమ్మేళనాలు, అవధానాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వరంగల్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని అన్నారు. లేజర్షోలు, ప్రత్యేక ప్రచురణలు, డాక్యుమెంటరీలు తీసుకురావాని ఆయన సూచించారు. జిల్లావ్యాప్తంగా క్రీడోత్సవాలు నిర్వహించాలని, ఎన్ఆర్ఐలను భాగస్వాములను చేసేందుకు తెలంగాణ ప్రవాసీ దివస్, వైబ్రంట్ తెలంగాణ లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకరోజు వరంగల్లోనే గడిపే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. అదేవిధంగా పార్లమెంట్లో ఝాన్సీరాణి చిత్రపటం ఉన్నట్టే రాణి రుద్రమదేవి చిత్రపటం ఏర్పాటు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతామన్నారు. బమ్మెరలో పోతన, పాల్కురికి సోమనాథుడి పేర్ల మీద కూడా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.
బమ్మెరలో పోతనామాత్యుడు దున్నిన నాలుగు ఎకరాల భూమిలో స్మారక కట్టడాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మిషన్ కాకతీయ ప్రారంభానికి సూచికగా వడ్డెపల్లి చెరువు వద్ద పైలాన్ నిర్మిస్తామని సీఎం పేర్కొన్నారు.
కాకతీయ ఉత్సవాలకు బస్తర్ రాజు
కాకతీయ ఉత్సవాలకు బస్తర్లో ఉన్న కాకతీయుల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ను ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించాలని జిల్లా ఎమ్మెల్యేలు చేసిన సూచనకు సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా అధికారికంగా ఈ ఉత్సవాలకు ఆయనను పిలిపించే ఏర్పాట్లు చేస్తామని సీఎం సమావేశంలో ప్రకటించారు.