విస్తరణ: టిడిపి జంప్ జిలానీలకు రివార్డులు (పిక్చర్స్)
హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లోకి వలస వచ్చినవారికి పెద్ద పీట వేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావుకు, హైదరాబాద్ జిల్లాకు చెందిన తలసాని శ్రీనివాస యాదవ్కు ఆయన మంత్రి పదవులు ఇచ్చారు.
తుమ్మల నాగేశ్వర రావు ఉభయ సభల్లోనూ సభ్యుడు కారు. తలసాని శ్రీనివాస యాదవ్ ప్రమాణ స్వీకారానికి ముందు శాసనసభా సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. అజ్మీరా చందూలాల్ కాంగ్రెసు నుంచి టిఆర్ఎస్లోకి వచ్చారు. ఆయన కూడా ఏ సభలోనూ సభ్యుడు కారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా నుంచి బిఎస్పీ అభ్యర్థిగా గెలిచి, ఆ పార్టీని టిఆర్ఎస్లో విలీనం చేశారు.
లక్ష్మారెడ్డి మాత్రం మొదటి నుంచి కూడా టిఆర్ఎస్లోనే ఉన్నారు. జూపల్లి కృష్ణా రావు కాంగ్రెసు నుంచి టిఆర్ఎస్లోకి వచ్చారు. అయితే, గత ఎన్నికల్లో టిఆర్ఎస్ టికెట్ తీసుకుని విజయం సాధించారు. అంతకు ముందు కాంగ్రెసు పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
ఆరుగురు కొత్త మంత్రులు వీరే
కెసిఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకున్న ఆరుగురు కొత్తవారు వీరే. వీరిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్లోకి వచ్చినవారు.
తుమ్మల ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన టిడిపి నుంటి వచ్చి టిఆర్ఎస్లో చేరారు.
ఇంద్రకరణ్ రెడ్డి ప్రమాణం
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బిఎస్పీ తరఫున పోటీ చేసి గెలిచి టిఆర్ఎస్లో చేరారు.
తలసాని శ్రీనివాస యాదవ్
హైదరాబాద్ జిల్లాకు చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్లోకి వస్తూనే మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆయన టిడిపిలో ఉండేవారు.
లక్ష్మారెడ్డి ప్రమాణం
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన లక్ష్మారెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన మొదటి నుంచి కూడా టిఆర్ఎస్లోనే ఉన్నారు.
చందూలాల్ ప్రమాణం
వరంగల్ జిల్లాకు చెందిన అజ్మీరా చందూలాల్ను మంత్రి పదవి వరించింది. ఆయన కాంగ్రెసు నుంచి వచ్చి టిఆర్ఎస్లో చేరారు.
జూపల్లి కృష్ణా రావు ప్రమాణం
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి విడతనే ఆయనకు మంత్రి పదవి దక్కాల్సింది. కానీ ఆగిపోయింది.
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ హాజరు
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు.
మంత్రులతో కెసిఆర్
తన మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రూప్ ఫొటో దిగారు. కెటిఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి రాలేదు.