హైద్రాబాద్ 'శ్రీమంతుడు' కెసిఆర్: బాబుకు టిఆర్ఎస్ ప్రశంస, 'స్మార్ట్ సిటీ' ఫైట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం నాడు మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాలోని డైలాగ్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆపాదించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో భాగ్యనగరం అభివృద్ధిపై పార్టీల మధ్య పోటాపోటీగా మాటలు కనిపించాయి. హైదరాబాదును తామే అభివృద్ధి చేశామని టిడిపి అంటే, కాదు మేమేనని కాంగ్రెస్ పార్టీ.. అరవయ్యేళ్లలో అభివృద్ధి జరగలేదని, మేం చేస్తామని తెరాస చెబుతోంది.
ఇందులో భాగంగా కెటిఆర్ సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీమంతుడు డైలాగ్ను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ... మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాలో ఓ డైలాగ్ ఉందని, దత్తత తీసుకోవడం అంటే చుట్టపు చూపుగా వచ్చి పోవడం కాదని, అంతా చేయడమని, మొత్తం బాధ్యత తీసుకోవడం అని అందులో ఉందని చెప్పారు.
అలాగే, హైదరాబాద్ అభివృద్ధి పైన ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి సారించారని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత తనదేనని కెటిఆర్ చెప్పారు. తద్వారా.. హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత మొత్తం తమదేనని కెటిఆర్ చెప్పే ప్రయత్నం చేశారు.
అంతకుముందు, ఆయన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ అభివృద్ధిలో పాత్ర ఉందని చెప్పడం గమనార్హం. హైదరాబాద్కు ప్రపంచంలో చంద్రబాబు మంచి మార్కెట్ తెచ్చారని కితాబిచ్చారు. అయితే ఆయన ఒక్కడే అభివృద్ధి చేయలేదన్నారు.
'స్మార్ట్ సిటీ' గొడవ
ఏపీకి రెండు స్మార్ట్ సిటీలు ఇచ్చి తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని టిఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తద్వారా కేంద్రం సహకారం తెలంగాణ రాష్ట్రానికి లేదని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి - బిజెపి గెలిచినా ఏం చేయరని, రాష్ట్ర ప్రభుత్వం వల్లే అభివృద్ధి అని చెబుతున్నారు.
కేంద్రం నుంచి సరైన సహకారం లేదని తెరాస నేతలు చెబుతున్నారు. దీనిపై టిడిపి, బిజెపి నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. కెసిఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల పైన ఏమాత్రం స్పందించలేదని, దీంతో కేంద్రం తొలుత పదివేల ఇళ్లు ఇచ్చిందని, చంద్రబాబు తెలంగాణ కోసం అడగటంతో మొత్తం ముప్పై వేలు ఇచ్చిందని చెబుతున్నారు.
స్మార్ట్ సిటీగా హైదరాబాద్ను ప్రకటించేందుకు కెసిఆరే ముందుకు రాలేదని బిజెపి, టిడిపి నేతలు చెబుతున్నారు. ఆయన హైదరాబాద్ పేరును స్మార్ట్ సిటీ జాబితా నుంచి తొలగించారని ఆరోపిస్తున్నారు. అలాంటప్పుడు స్మార్ట్ సిటీ గురించి ఎలా ప్రశ్నిస్తారని అంటున్నారు. వరంగల్ను కేంద్రం వారసత్వ నగరంగా ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు.
మరోవైపు, తెరాస మంత్రులు ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాదును అభివృద్ధి చేశాడని పరోక్షంగా, ప్రత్యక్షంగా అంగీకరిస్తున్నారు. కెటిఆర్ మాట్లాడుతూ.. హైదరాబాదుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా బిజినెస్ చేశారని, అభివృద్ధి చేశారని, కానీ తానే మొత్తం చేశానని చెప్పడం సరికాదన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... సీఎంగా చంద్రబాబు అభివృద్ధి చేశారన్నారు.