'ఏంటీ బాల పోచయ్యా ఇలా వచ్చావ్': పాత మిత్రుడికి కేసీఆర్ ఆప్యాయ పలకరింపు
హైదరాబాద్: టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆదివారం ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఓ వ్యక్తిని చూసి ఆశ్చర్యానికి గురి కావడమే కాకుండా వెంటనే ఆయన దగ్గరికి వెళ్లిపోయారు.
'ఏంటీ బాల పోచయ్యా ఇలా వచ్చావ్' అంటూ సదరు వ్యక్తిని పేరు పెట్టి మరీ పలకరించిన కేసీఆర్, ఆయనకు కుశల ప్రశ్నలేశారు. కేసీఆర్ పలకరిస్తున్న ఆ వ్యక్తి ఎవరో తెలియక అక్కడి వారంతా అయోమయంలో పడ్డారు.
ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని స్నేహానికి కేసీఆర్ ఇచ్చిన విలువను కీర్తించారు. సీఎం పలకరింపుతో ఆనందపడ్డ బాల పోచయ్య, తాను టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. అప్పటి వరకు ఆయన టీఆర్ఎస్లో చేరిన విషయం తెలియని సీఎం ఒకసారి క్యాంపు కార్యాలయానికి వచ్చి కలవాల్సిందిగా కోరారు.
పార్టీలో మంచి పదవి ఇస్తానని బాలపోచయ్యతో చెప్పి కరచాలనం చేసి తన అప్యాయతను చాటుకున్నారు. ఒకప్పుడు తనతో పాటు యూత్ కాంగ్రెస్లో బాలపోచయ్య, సీఎం కేసీఆర్ చురుగ్గా పనిచేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కేసీఆర్, బాల పోచయ్య ఇద్దరూ చాలా సన్నిహితంగా మెలిగేవారట.