దారికి రావాలంటే షాక్ ట్రీట్మెంటే?: కేసీఆర్ వ్యూహంతో వణుకుతున్న సిట్టింగ్లు..
సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే.. పార్టీకి ప్రతికూలమని భావిస్తే నిర్మొహమాటంగా తప్పించేందుకే ఆయన మొగ్గుచూపుతున్నారట.
హైదరాబాద్: పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మీద మూడేళ్ల టీఆర్ఎస్ అప్రతిహత దండయాత్ర మరోసారి ఆ స్థాయిలో రిపీట్ అవడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. క్రమక్రమంగా ముసురుతున్న వివాదాలు పార్టీ పట్ల జనంలో వ్యతిరేకతకు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
అయితే ఈ డ్యామేజ్ అంతటికీ కారణం.. క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలు, మంత్రుల పట్టిలేని వైఖరే కారణమని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాలకు ఇస్తున్న ప్రాధాన్యం పార్టీకి గానీ, ప్రజాప్రతినిధిగా నిర్వర్తించాల్సిన విధులకు గానీ ఇవ్వకపోతుండటం పార్టీ పట్ల వ్యతిరేకతకు కారణమని సీఎం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నిసార్లు చెప్పినా..:
క్షేత్రస్థాయిలో చాలామంది ఎమ్మెల్యేల వైఖరి పట్ల సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పద్దతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా.. వారి తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఆయనలో తీవ్ర అసహనం పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు ఇవ్వడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్న పరిస్థితి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. పని తీరు బాగా లేని ఎమ్మెల్యేలకు ఉద్వాసన పలకడమే బెటర్ అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
డేంజర్ బెల్స్:
ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉన్నందునా.. ఇప్పటినుంచే పార్టీ బలాబలాలపై కేసీఆర్ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఏ నియోజకవర్గంలో ఎవరి బలమెంత? అన్న దానిపై ఆయన ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే.. పార్టీకి ప్రతికూలమని భావిస్తే నిర్మొహమాటంగా తప్పించేందుకే ఆయన మొగ్గుచూపుతున్నారట. ముఖ్యంగా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్లకు డేంజర్ బెల్స్ మోగడం ఖాయమంటున్నారు. వారి స్థానంలో గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం.
ఓడినా పర్లేదు.. పిలవండి:
పార్టీని బలోపేతం చేసే క్రమంలో భాగంగా.. పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో టీఆర్ఎస్ ను వీడినవారు లేదా వేరే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన నేతలనూ గులాబీ గూటికి చేర్చాలని భావిస్తున్నారట. గతంలో ఓడిపోయినప్పటికీ.. ఛరిష్మా ఉన్న నేతయితే పార్టీలోకి తీసుకురావాల్సిందిగా కేసీఆర్ ఆదేశిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాల వారీగా జాబితా సిద్దం చేసే పనిలో గులాబీ శ్రేణులు సిద్దమైనట్లు చెబుతున్నారు.
షాక్ ట్రీట్మెంట్?:
పార్టీలో ఎమ్మెల్యేలను అప్రమత్తం చేయడానికే ఇలాంటి లీకులు ఇస్తున్నారని చెప్పేవారు లేకపోలేదు. ఎమ్మెల్యేల స్థానానికి ఎర్త్ పెట్టబోతున్నామన్న సంకేతాలిస్తేనే.. వారికది షాకింగ్ ట్రీట్మెంట్లా పనిచేస్తుందన్న ఉద్దేశంతో కేసీఆర్ ఈ వ్యూహానికి తెరలేపారన్న వాదన కూడా ఉంది. అలా అయితేనే నేతలు దారికి వస్తారని.. పని పట్ల, పార్టీ పట్ల ఫోకస్ పెంచుతారని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ లీకులతో ఎమ్మెల్యేలకు మాత్రం భయం పట్టుకుంది. మొన్నీమధ్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తిరిగి టికెట్ ఇస్తామని భరోసా ఇచ్చిన కేసీఆర్.. ఇంతలోనే ఇలాంటి లీకులతో వారిని కంగారెత్తిస్తున్నారు.