అందరికీ ఆస్తులొస్తే, మాకు కరెంట్ కష్టాలు: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణలో ఎదురవుతున్న కరెంట్ కష్టాల బాధ్యతను తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు గత ప్రభుత్వాల మీదికి నెట్టేశారు. విడిపోతే అదంరికీ వారసత్వంగా ఆస్తులు వస్తే తమకేమో కరెంట్ కష్టాలు వచ్చాయని ఆయన అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమర్స్ ట్రైనింగ్ సెంటర్ను ఆయన గురువారంనాడు ప్రారంభించారు.
గత ప్రభుత్వ అసమర్థ పాలనవల్లనే విద్యుత్తు కష్టాలు వచ్చాయని ఆయన అన్నారు. వచ్చే ఏడాది జూన్, జులైనాటికల్లా వేయి మెగావాట్ల సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
విద్యుత్తు సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందని కెటిఆర్ చెప్పారు. రైతులకు సమస్యలు వస్తే స్థానిక అధికారులను గానీ తమ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలను గానీ కలవాలని ఆయన సూచించారు. 2015 చివరి నాటికల్లా థరమ్మల్ విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
ఇదిలావుంటే, రైతులకు విద్యుత్తు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మరో మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. బహిరంగ మార్కెట్లో ఎంత విద్యుత్తు దొరికితే అత కొంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలను, రైతులను ప్రతిపక్షాలు మభ్య పెడుతున్నాయని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో కన్నా తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్తు ఇస్తున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే ప్రస్తుత విద్యుత్తు కష్టాలకు కారణమని ఆయన అన్నారు.
టిడిపి ఎమ్మెల్యేల ఆందోళన
తెలంగాణ సచివాలయంలో విద్యుత్తు శాఖ కార్యదర్శి కార్యాలయం ఎదుట తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. విద్యుత్తు సమస్యలపై విద్యుత్తు శాఖ కార్యదర్శిని కలిసేందుకు టిడిపి శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి తదితరులు సచివాలయానికి వచ్చారు.
విద్యుత్తు శాఖ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయం ఎదుట గురువారం వారు బైఠాయించి ఆందోళనకు దిగారు. విద్యుత్తు శాఖ కార్యదర్శి వచ్చే వరకు ఇక్కడే ఉంటామని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.