సంప్రదాయ సంగమం.. తరతరాల అనుబంధం: నేటి నుంచే నాగోబా జాతర
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతర శుక్రవారం రాత్రి మెస్రం వంశస్థుల మహాపూజలతో ప్రారంభం కానుంది.
ఆదిలాబాద్: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతర శుక్రవారం రాత్రి మెస్రం వంశస్థుల మహాపూజలతో ప్రారంభం కానుంది. నాగోబా జాతర తెలంగాణ రాష్ట్రంలోనే రెండో స్థానం పొందింది. మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి గిరిజనులు ఇక్కడి తరలివస్తారు.
గిరిజన సంస్కృతి, సంప్రదాయల్లో నాగోబా జాతరకు విడదీయలేని సంబంధముంది. మెస్రం వంశస్థులు ఏ ప్రాంతంలో స్థిరపడినా జాతర నాటికి కేస్లాపూర్లో కలుస్తారు. కష్టసుఖాలు తెలుసుకోవడం, మంచి చెడును నిర్ణయించుకోవడం జాతర ప్రత్యేకత. చిన్నా పెద్ద, ఆడామగ తేడా లేకుండా కుటుంబాలకు కుటుంబాలు ఎడ్లబండ్ల పై తరలివచ్చి నాగోబా సన్నిధిలోని మర్రి చెట్ల నీడలో సేద తీరారు.. జొన్నలతో తయారు చేసిన గటక, అంబలి, సాంబరును మట్టి కుండలో వండి దేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు.
పెళ్లిల్లు చేసుకున్న దంపతులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తేనే వారి సంప్రదాయం ప్రకారం అధికారిక ముద్ర పడినట్లు భావిస్తారు. మెస్రం వంశీయుల్లో చనిపోయిన వారికి నాగోబా ఆలయానికి కిలో మీటరు దూరంలోని మర్రిచెట్ల వద్ద కర్మకాండ(తూం) బుధవారం రాత్రి నిర్వహించారు.
ఇలా మొక్కులు తీర్చుకుంటే వారికి ఆత్మశాంతి కలుగుతుందని విశ్వాసం. మెస్రం వంశీయులు వాహనాల్లో కాకుండా ప్రత్యేకంగా ఎడ్లబండ్లపై రావాలనేది నాగోబా జాతర పండుగ నియమం. చెట్టుకిందనే సేదతీరడం ప్రత్యేకత.