పక్కోడిని దోచుకోకపోవడం తెలంగాణ నుంచి నేర్చుకోవాలి: మాడభూషి, సెక్షన్ 8పై బాబుకు షాక్
వరంగల్: హైదరాబాదులో సెక్షన్ 8 పెట్టాలన్న ఏపీ తెలుగుదేశం నిర్ణయంతో పలువురు విభేదిస్తున్నారు. తాజాగా కేంద్ర సమాచార కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ కూడా హైదరాబాదులో సెక్షన్ 8 అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర స్వపరిపాలన, సార్వభౌమాధికారానికి హైకోర్టు విభజన కావాల్సిందేనని, దీని కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వరంగల్ జిల్లా ఖాజీపేటలో తెలంగాణ వికాస సమితి ప్రథమ వార్షికోత్సవంలో శ్రీధర్ మాట్లాడారు.
మాడభూషి శ్రీదర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు - విభజన అనంతరం సమస్యలపై మాట్లాడారు. హైకోర్టు విభజన అనివార్యంగా మారిందన్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం విభజన జరగకపోవడం వల్ల కేసుల పరిష్కారంలో జాప్యం చోటు చేసుకునే అవకాశాలున్నాయన్నారు.
తెలంగాణ వారికి పక్కవారిని దోచుకోవడం తెలియదని, అందుకే వారికి హాయిగా నిద్రపడుతుందని, హాయిగా నిద్రించడం తెలంగాణకు వచ్చి నేర్చుకోవాలని చంద్రబాబుకు చురకలంటించారు. ఎన్టీఆర్ హైదరాబాద్ ప్రజలకు ఉదయం నిద్రలేవడం నేర్పారని చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తెలంగాణ నిద్ర లేచిందని చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర సాధనే నిదర్శనమన్నారు. పక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ముఖ్యం ప్రత్యేక హైకోర్టు అన్నారు. దీంతో, రెండు రాష్ట్రాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో సమాచార కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.