బీజేపీ సభ: 'హైదరాబాద్ రానివ్వమన్నారు, పులిబిడ్డగా మోడీ వచ్చారు'
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలోని బీజేపీ సమ్మేళనంలో పాల్గొన్నారు. గజ్వెల్ నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన.. రోడ్డు మార్గాన ఎల్బీ స్టేడియానికి వచ్చారు. బీజేపీ సమ్మేళనంలో పలువురు నేతలు మాట్లాడారు.
తెలంగాణకు వందనాలు, టిక్కెట్ కొని నా సభకు వచ్చారు: మోడీ
బీజేపీ నేతలు, కార్యకర్తలకు, తెలంగాణకు నా వందనాలు, నా నమస్కారాలు అని ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో వ్యాఖ్యానించారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ సమ్మేళనంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఎన్నికలకు ముందు టిక్కెట్లు కొని హైదరాబాద్ ప్రజలు తన సభకు వచ్చారని, అది చరిత్ర అన్నారు. కొత్త చరిత్ర సృష్టించడంలో తెలంగాణ ముందుంటుందన్నారు.
రాజకీయ పార్టీలకు ఇదో కొత్త అధ్యాయనం అన్నారు. 2013లో ఎన్నికల సమయంలో టిక్కెట్లు కొని తన సభకు రావడం ద్వారా హైదరాబాద్ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించారన్నారు. ఇప్పుడు ఇంతమందిని ఏకం చేసిన రాష్ట్ర నాయకత్వానికి అభినందనలు అన్నారు.
2013 ఎన్నికల ప్రచారం సమయంలో డబ్బులు పెట్టి టిక్కెట్లు కొని తన సభకు వచ్చారని, అది బీజేపీ కార్యకర్తల బలానికి నిదర్శనం అన్నారు. భారీ జనసభలు కష్టమన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను తయారు చేయడం కఠినమైన పని అన్నారు. కానీ ఇక్కడ సమావేశమైన కార్యకర్తలను చూస్తుంటే తెలంగాణ భవిష్యత్తు కనిపిస్తోందన్నారు.
చేనేతకు తలొంచి నమస్కరిస్తున్నా: మోడీ
ఆగస్టు 7వ (ఈ రోజు) తేదీన తెలంగాణలో కొత్త రాజకీయ మలుపు అన్నారు. నా మెడలో వేసిన ఈ శాలువా ఈ గడ్డ శ్రామికులు నేసిందన్నారు. ఇంత గొప్ప కళను ఆవిష్కరించిన నేతన్నకు తలవంచి నమస్కరిస్తున్నానని చెబుతున్నానన్నారు.
సెప్టెంబర్ 17 దాకా తిరంగా యాత్ర
తెలంగాణ ప్రజలు ఆగస్ట్ 15 వరకు మాత్రమే కాదని, సెప్టెంబర్ 17 వరకు తిరంగా యాత్ర చేయాలన్నారు. ద్విచక్ర వాహనాలతో తిరంగా యాత్ర చేయాలన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కు తెలంగాణ ప్రజానీకం ఇచ్చే నివాళి అదే అన్నారు. స్వతంత్ర ఉద్యమం ముడివడి ఉన్నచోట పుష్పగుచ్ఛం ఉంచాలన్నారు.
ఇప్పుడు దేశానికి కావాల్సింది కాషాయ విప్లవం అన్నారు. కాషాయ విప్లవం ఉంటే విద్యుత్ ఉత్పాదన అన్నారు. గ్రామగ్రామాన విద్యుత్ లక్ష్యంగా విప్లవం కొనసాగాలన్నారు. శ్వేత విప్లవం తీసుకు రావాలన్నారు.
రాజకీయ పండితులు కొత్త లెక్కలు వేసుకోవాలి: మోడీ
తనకు ఇక్కడ తెలంగాణ భవిష్యత్తు కనిపిస్తోందన్నారు. రాజకీయ పండితులు ఇక తెలంగాణ భవిష్యత్తు పైన కొత్త లెక్కలు వేసుకోవాలన్నారు. బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందని 2014 ఎన్నికల సమయంలో రాజకీయ పండితులు నమ్మలేదన్నారు.
కాంగ్రెస్ హయాంలో టీవీ ఆన్ చేస్తే అవినీతి గురించే వచ్చేదన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం హయాంలో అవినీతి లేదన్నారు. తమకు 120 కోట్ల మంది ప్రజలే హైకమాండ్ అన్నారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ మంత్రంతో తాము ముందుకెళ్తున్నామన్నారు. రెండేళ్లలో తమ ప్రభుత్వంపై అవినీతి మచ్చ లేదన్నారు. పేద ప్రజల సొమ్ము దోచుకోలేదన్నారు.
పేదల డబ్బును ఎవరినీ దోచుకోనివ్వనని చెప్పారు. ఒకప్పుడు ఒక్కో ఎంపీ నియోజకవర్గానికి 25 గ్యాస్ కూపన్లు దక్కేవన్నారు. గతంలో కొందరు గ్యాస్ను బ్లాక్ మార్కెట్లో కూడా అమ్ముకున్నారన్నారు. తాము ఇప్పుడు 5 కోట్ల మంది పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఒక్క మాటతో పాతిక లక్షల మంది గ్యాస్ రాయితీ వదులకున్నారన్నారు. వారు వదిలిన రాయితీతో పేదలకు ఇచ్చామన్నారు.
రెండేళ్ల క్రితం ఫైవ్ స్టార్ హోటళ్లు పైరవీకారులతో నిండి ఉండేవన్నారు. ఇప్పుడు ఢిల్లీ హోటళ్లలో పైరవీకారులు కనిపించడం లేదన్నారు. నగదు బదలీ పథకంతో అక్రమార్కులకు అడ్డుకట్ట వేశామన్నారు. తమ రెండేళ్ల పాలనలో చిన్న మచ్చ చూపేందుకు కూడా విపక్షాలు వెనుకాడుతున్నాయన్నారు.
అధికారంలోకి వస్తాం: దత్తాత్రేయ
తెరాసకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకు వస్తామని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు.
ఫిరాయింపులతో తలవంపులు: డాక్టర్ కె లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్రానికి తలవంపులు తెచ్చేలా కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారన్నారు. ప్రధాని మోడీ ప్రపంచ పటంలో భారత దేశాన్ని నిలుపుతున్నారన్నారు. రెండేళ్ల కేసీఆర్ పాలనలో నోట్లు, ఓట్లు సీట్లే అన్నారు.
నాలుగు సీట్లు ఉన్న హర్యానాలో అధికారంలోకి వచ్చామని, ఐదు సీట్లు ఉన్న అస్సాంలో అధికారంలోకి వచ్చామని, అలాగే ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న మన పార్టీ తెలంగాణలోను 2019లో అధికారంలోకి వస్తుందన్నారు.
అప్పుడు వివేకాందుడు, ఇప్పుడు నరేంద్రుడు (మోడీ) దేశాన్ని ప్రపంచలో భారత్ ప్రతిష్ట పెంచారన్నారు. కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం సత్తా బీజేపీకే ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు. ఆ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు. కాంగ్రెస్ కుంభకోణాల పార్టీ అన్నారు.
యూపీఏ పాలనకు, ఎన్డీయే పాలనకు నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. మజ్లిస్కు తలొగ్గిన కేసీఆర్ ప్రభుత్వం.. సెప్టెంబర్ 17ను నిర్వహించడం లేదన్నారు.
ఇంటింటికి మోడీ, పల్లెపల్లెకు బీజేపీ అనే నినాదంతో ముందుకు పోతామన్నారు. తెలంగాణకు కేంద్రం ఎంతో సాయం చేస్తోందన్నారు. తన, పర అనే బేధం లేకుండా అన్ని రాష్ట్రాలకు సహకరిస్తోందన్నారు. తెరాసకు ఉప ఎన్నికల పైన ఉన్న దృష్టి ప్రజా సంక్షేమం పైన లేదన్నారు.
నిరుద్యోగస్తులకు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. తాము ఎమ్మెల్యేలం అయిదుగురం ఉన్నప్పటికీ.. నీతి వైపు ఉన్నామన్నారు. అసోంను ప్రేరణగా తీసుకొని.. 2019లో గెలుస్తామన్నారు. 2019 ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుస్తామన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్రం సక్రమంగా వినియోగించాలన్నారు.
పులిబిడ్డగా హైదరాబాదులో అడుగు పెట్టారు: కిషన్ రెడ్డి
నరేంద్ర మోడీని ప్రధాని కానివ్వమని ఆనాడు, ఆయనను హైదరాబాదులో అడుగు పెట్టనీయమని ఆ తర్వాత పలువురు హెచ్చరించారని, కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ పులిబిడ్డగా, ప్రధానిగా హైదరాబాదులో అడుగు పెట్టారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. గతంలో మజ్లిస్ పార్టీ మోడీని ప్రధాని కానివ్వమని, హైదరాబాద్ రానివ్వమని చెప్పింది. విపక్ష నేతలు కూడా మోడీని హైదరాబాద్ రానివ్వమన్నారు.