పోలీస్ ప్రిలిమ్స్ పరీక్ష: ఒక్కనిముషం ఆలస్యమైనా నో ఎంట్రీ; నిబంధనలు అసలు మర్చిపోకండి!!
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఈనెల 7వ తేదీన నిర్వహించనున్న ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం నాడు నిర్వహించనున్న పోలీస్ ప్రిలిమ్స్ పరీక్షకు మొత్తం 538 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాలలో 503 పరీక్షా కేంద్రాలు, ఇతర పట్టణాల్లో 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, పరీక్షకు సన్నాహకాలు చేసింది. 554 ఎస్ఐ పోస్టులకు 2,47,217 మంది అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
ఒక్క నిముషం ఆలస్యం అయినా పరీక్ష రాసేందుకు నో ఛాన్స్
ఈ నెల 7వ తేదిన నిర్వహింబడే పోలీస్ రిక్రూట్ మెంట్ ఎస్.ఐ ప్రాథమిక పరీక్షకు సంబంధించి పరీక్షకు హజరవుతున్న అభ్యర్థులకు పలుసూచనలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసారు. పరీక్ష ఉదయం 10:00 నుండి మద్యాహ్నం 1:00 గం॥ల వరకు నిర్వహించబడుతుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 9:00 గంల వరకే చేరుకోవాలి. ఉదయం 10:00 గం॥ల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేయబడుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించరు.
హాల్ టికెట్ పై ఫోటో అతికించుకురావాలి... పిన్ చెయ్యరాదు
పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాచ్ లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. అభ్యర్థులు తమ వెంట పరీక్ష హాల్ టికెట్, పెన్ మాత్రమే తీసుకురావాలి. పరీక్ష కేంద్రంలో మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్ లు పెట్టుకోవడానికి ఎటువంటి సదుపాయాలు ఉండవు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ పై పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అంటించుకొని రావాలి. లేనిచో పరీక్షకు అనుమతించరు. హాల్ టికెట్ ను రెండు వైపులా ప్రింట్ తీసుకోవాలి. హాల్ టికెట్ పై ఫోటోను పిన్ చేయరాదు.
మెహిందీ, టాటూలూ పెట్టుకోవద్దు.. బయో మెట్రిక్ తప్పనిసరి
అభ్యర్థులు తమ హాల్ టికెట్ లో అన్ని వివరాలను సరి చూసుకోవాలి. హాల్ టికెట్ తో పాటు ఎటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ లు అక్కర్లేదు. పరీక్షకు బయోమెట్రిక్ అటెండెన్స్ (ఆధార్ వేలి ముద్రలు) తప్పనిసరి. ప్రాథమిక పరీక్షకు బయోమెట్రిక్ వేలిముద్రల హాజరు నమోదు చేస్తారు. కాబట్టి మెహిందీ, టాటూలూ పెట్టుకోవద్దు. పరీక్షలో తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. అభ్యర్థులు తమ రూమ్ నెంబర్ మరియు సంబందిత సీట్ చేరుకొని ప్రశ్నాపత్ర కోడ్ ను పరిశీలించుకోవాలి. పరీక్ష వేళలు ముగిసేవరకు అభ్యర్థులు హాల్ లోనే ఉండవలెను.
కోవిడ్ రూల్స్ పాటించాలి, పరీక్ష పూర్తయ్యాక బయోమెట్రిక్
అభ్యర్థులు, ఎగ్జామ్ విధి నిర్వాహణలో ఉన్నవారు తప్ప ఎవరినీ పరీక్ష మెయిన్ గేట్ దాటి లోపలికి అనుమతించబడరు. పరీక్షకోసం నిర్ధారిత వేళల్లో "బెల్" కొట్టిస్తారు. ఇన్విజిలేటర్ అభ్యర్థులకు ప్రకటిస్తారు. పరీక్ష ముగిసిన తర్వాత అందరి ఓఎంఆర్ షీట్లు తీసుకున్నాక, అందరి బయోమెట్రిక్ అటెండెన్స్ పూర్తయ్యాకనే అందరు అభ్యర్థులను ఒకేసారి బయటికి పంపిస్తారు. కోవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులు మాస్క్ ధరించాలి.ధర్మల్ స్క్రీనింగ్ మరియు శానిటైజర్ తో శుభ్రం చేసుకున్నాక కేంద్రంలోకి ప్రవేశించాలి. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలి.