పౌల్ట్రీ ఫారాల్లో కాలేజీలంటూ కడియం: వేడిగా చర్చ
హైదరాబాద్: ఫీజు రీయంబర్స్మెంట్పై తెలంగాణ విద్యా శాఖ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యపై కాంగ్రెసు సభ్యుడు పువ్వాడ అజయ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పౌల్ట్రీ ఫారాల్లో ఇంజనీరింగ్ కళాశాలలు నడుస్తున్నాయని కడియం చేసిన వ్యాఖ్యపై అజయ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఇటువంటి వ్యాఖ్యల వల్లనే బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోందని ఆయన అన్నారు. మంగళవారం తెలంగాణ శాసనసభలో ఫీజు రీయంబర్స్మెంట్పై చర్చ జరిగింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెసు సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
నిబంధనలు పాటించని కాలేజీలు ఉంటే చర్యలు తీసుకున్నా ఫరవాలేదని, విద్యార్థులను మాత్రం ఇబ్బంది పెట్టవద్దని పువ్వాడ అజయ్ అన్నారు. అయితే, ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేసిన తర్వాత కూడా విమర్శలు చేయడం సరి కాదని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెసు సభ్యులు చేసిన విమర్శలకు ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. కాంగ్రెసు కూడా అవినీతి గురించి మాట్లాడితే తాము ఏం చేయాలని ఆయన అన్నారు. కాలేజీల్లో ప్రమాణాలు పడిపోవడానికి కాంగ్రెసు పార్టీయే కారణమని ఆయన విమర్శించారు.
ఇది విద్యార్థుల సమస్య కాదని, విద్యార్థులను అన్ని విధాలా ఆదుకుంటామని, వారికి ఇబ్బంది కలిగించే చర్యలు ఏమీ తాము చేపట్టబోమని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని, జేఎన్టీయూను తప్పుదోవ పట్టించిన 16 ఇంజనీరింగ్ కళాశాలలపై క్రిమినల్ కేసులు పెట్టామని కడియం శ్రీహరి అసెంబ్లీలో చెప్పారు. సరైన పత్రాలు చూపించనందున ఈ కళాశాలలపై కేసులు పెట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యాప్రమాణాలు పడిపోయాయన్నారు. కళాశాలలు అనుమతి తీసుకునేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయని తెలియజేశారు. బోధనా రుసుం భారం నుంచి తప్పించుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగదని డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో చాలా మంది విద్యార్థులు చదువు మానేయడం జరిగిందని విపక్ష సభ్యులు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై మంత్రి కడియం స్పందిస్తూ.. రియింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల ఒక్క విద్యాైర్థెనా చదవు మానేసిండని రుజువు ఉంటే చూపండి? దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని కడియం స్పష్టం చేశారు.
విద్యార్థులందరికి ఫీజు రియింబర్స్మెంట్ చెల్లిస్తామని స్పష్టం చేశారు. 16 లక్షల మంది విద్యార్థులకు 2,500 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. రియింబర్స్మెంట్ తగ్గించుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. ఫీజు రియింబర్స్మెంట్లో అవినీతి జరిగిందని ప్రభుత్వానికి ఇంత వరకు ఫిర్యాదు రాలేదని చెప్పారు. ఈ ప్రభుత్వం వందకు వంద శాతం నీతిగా పని చేస్తుందని స్పష్టం చేశారు. ఫీజు రియింబర్స్మెంట్ కొనసాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఫీజు రియింబర్స్మెంట్పై ప్రత్యేక చర్చ నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఉద్ఘాటించారు.
అంతకు ముందు, ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలు, చర్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపై శాసనసభలో వాడీవేడిగా చర్చ సాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా విపక్ష సభ్యులు అక్బరుద్ధీన్, లక్షణ్ లు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ.. ఇంజినీరింగ్ విద్యా ప్రమాణాల పెంపుకు ప్రభుత్వ చేపడుతున్న చర్యలను, ప్రమాణాలు పాటించని కాలేజీలపై తీసుకున్న చర్యలు, ఫీజు బకాయిల విడుదల వంటి అంశాలను క్లుప్తంగా వివరించారు. మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని సభ్యులు సవివరమైన చర్చకు పట్టుబడుతూ ఆందోళన చేపట్టారు. దీనిపై మంత్రి స్పందిస్తూ పూర్తిస్థాయిలో చర్చించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇందుకు సమయం విషయంలో సభాపతి అనుమతిస్తే మేము పూర్తిస్థాయి వివరాలు సభముందుంచుతామని పేర్కొన్నారు.
ఇరుపక్షాల ఆందోళనతో స్పీకర్ స్పందిస్తూ చర్చ పూర్తికి అన్ని పక్షాల సభ్యులు అనుమతి తెలపాల్సి ఉంటుందన్నారు. అయినా ప్రశ్నోత్తరాల సమయం ముగుస్తున్నందున సంబంధిత అంశంపై పూర్తిస్థాయిలో చర్చించడానికి వీలు కలగదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఇదే అంశంపై చర్చించాలనుకుంటే వేరే ఫాంలో నోటీసు ఇచ్చి చర్చకు రావాల్సిందిగా స్పీకర్ సభ్యులకు సూచించారు.