
జర్నలిస్టుల్ని ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తింపు.!ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచుతున్నామన్న డీహెచ్.
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోందని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. కరోనా రెండవ దశ నియంత్రణ కోసం అన్ని శాఖలు సమష్టిగా కృషిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పాటివిటీ రేటు 4.1శాతంగా ఉందన్నారు. ఇప్పటివరకు 1.47కోట్ల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నట్టు ఈ సందర్బంగా శ్రీనివాస్ ప్రకటించారు. ఈ నెల 28 నుంచి వారికి సమాచార ప్రసారాల శాఖ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200లకు పెంచుతున్నట్టు డీహెచ్ ప్రకటించారు.

పాజిటివిటీ రేటు తగ్గుతోంది : తెలంగాణలో ఇప్పటివరకు యాభై ఆరు లక్షల మందికి టీకాలు వేసినట్టు డీహెచ్ వెల్లడించారు. ప్రస్తుతం 6.18 లక్షల కొవిషీల్డ్, 2.5లక్షల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జూన్ తొలి వారంలో మరిన్ని డోసులు వస్తాయన్నారు. నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉండే వారిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి వారికి ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్ చేయనున్నట్టు తెలిపారు. క్యాబ్ డ్రైవర్లకు జీహెచ్ఎంసీ ద్వారా వ్యాక్సినేషన్ అందిస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి మూడు లక్షల మందికి కొవాగ్జిన్ రెండో డోసు ఇవ్వాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 4.1శాతం, రికవరీ రేటు 92.52శాతంగా ఉందన్న శ్రీనివాస్, మరణాల రేటు 0.56శాతంగా ఉందని తెలిపారు. ప్రతి 10మందిలో నలుగురికి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొవాగ్జిన్ తీసుకున్నవారు నాలుగు నుంచి ఆరు వారాల మధ్య రెండో డోసు తీసుకెోవాలని సూచించారు. కొవిషీల్డ్ తీసుకున్నవారు పన్నెండు నుంచి పదహారు వారాల మధ్యలో రెండో డోసు తీసుకోవాలని డీహెచ్ శ్రీనివాస్ సూచించారు.