గుండాలంటారా?, కేసీఆర్కు మిర్చి ఘాటు చూపండి: రేణుకా చౌదరి ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులెవరూ మిర్చి పంటను తగులబెట్టవద్దని, ఆ బస్తాలను ముఖ్యమంత్రి ఇంటికి పంపించి మిర్చి ఘాటెలా ఉంటుందో ప్రభుత్వానికి తెలియాలని పిలుపునిచ్చారు.
సోమవారం హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్లీనరీ, సభలకు రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని, అదే రైతులకు వంద కోట్లు ఇవ్వలేరా? అంటూ ఆమె ప్రశ్నించారు. మద్దతు ధర అడిగిన రైతులను గుండాలు అంటున్నారని, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జనావేదన సభలోనే మిర్చి సమస్యను ప్రస్తావించామని రేణుకా చౌదరి తెలిపారు.
ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. మిర్చి, కంది రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదని విమర్శలను తిప్పికొట్టారు.