నా ప్లాన్ నాకుంది, టార్గెట్ కేసీఆరే: ఎల్ రమణపై రేవంత్ సంచలనం, కుంతియాతో భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతోపాటు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణపై కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనతో పాటు పార్టీ మారమని ఏ ఒక్కరినీ కోరలేదని కాంగ్రెస్ నేత అన్నారు.
నా ఎత్తుగడ నాకుంది.. నా చుట్టే కేసీఆర్..
తాను చెప్పాలనుకున్నది చంద్రబాబు నాయుడుకు చెప్పే వచ్చానని తెలిపారు. రాజకీయంగా తన ఎత్తుగడ తనకుందని రేవంత్ స్పష్టం చేశారు. డిసెంబర్ 9న మీట్ ది ప్రెస్లో పాల్గొంటానని, ఆ తర్వాత కేసీఆర్ ఆలోచనలు అన్నీ తన చుట్టే తిరుగుతాయని అన్నారు.
కేసీఆర్కు ఉపాధి కూలి..
అంతేగాక, ‘టీడీపీలో ఉంటూ కేసీఆర్కు ఉపాధి కూలీ పని చేస్తున్నవారికి నేను చెప్పాల్సింది ఏమీ లేదు. కంచర్ల భూపాల్రెడ్డి టీఆర్ఎస్లో చేరితే ఎల్ రమణ ఎందుకు మాట్లాడలేదు. కేసీఆర్ దగ్గర డబ్బులు తెచ్చుకుని ఎల్ రమణ నాపై విమర్శలు చేస్తున్నారు' అని రేవంత్ విమర్శించారు.
ఇంకా ఎందుకు టీఆర్ఎస్లో చేరు..
‘కొడంగల్లో సమావేశం పెడతా అంటున్న రమణ.. గజ్వేల్, సిద్ధిపేట్లో సమావేశం పెడతా అని ఎందుకు? చెప్పడం లేదు. చేరాలనుకుంటే ముసుగు తీసి నేరుగా టీఆర్ఎస్లో రమణ చేరొచ్చు కదా!' అని రేవంత్ అన్నారు.
టార్గెట్ కేసీఆరే..
టీడీపీలో ఉన్న నేతలందరిని టీఆర్ఎస్లో చేర్చేవరకూ ఆయన టీఆర్ఎస్లో చేరడు. నాకు రమణ సర్టిఫికేట్ అవసరం లేదు. చేతనైతే సొంత నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకుని గెలవాలి. నా యుద్ధం కేసీఆర్ కూలీలపై కాదు... కేసీఆర్పైనే.' అని రేవంత్ స్పష్టం చేశారు.
కుంతియాతో భేటీ.. కీలక చర్చ
కాగా, శనివారం రేవంత్ రెడ్డితో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా భేటీ అయ్యారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ, పార్టీలో రేవంత్ స్థానంతో పాటు, ఆయన పదవిపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు గిరిజన రైతు గర్జన పేరిట నవంబర్ 20వ తేదీన కాంగ్రెస్ పార్టీ వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లుపై కూడా కుంతియా చర్చించినట్లు తెలుస్తోంది.
రేవంత్పై మోత్కుపల్లి విసుర్లు..
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలగుదేశం పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్నేత మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొందరు నేతలు సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారినా కార్యకర్తలు టీడీపీలోనే ఉన్నారన్నారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని అన్నారు. పత్తి, వరి రైతుల సమస్యలపై నవంబర్ 20న నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించనున్నట్లు మోత్కుపల్లి తెలిపారు.