జగన్తో కుమ్మక్కయ్యారా,కమిషన్లకు కక్కుర్తి పడ్డారా-ఆ సంతకం ఎందుకు పెట్టారు-కేసీఆర్ను నిలదీసిన రేవంత్
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ నట్టేట ముంచుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఏపీ సీఎం జగన్తో కుమ్మక్కయ్యారా.. లేక ఆయనకు లొంగిపోయారా... లేక మేఘా కృష్ణారెడ్డి ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడ్డారా అని ప్రశ్నించారు.తెలంగాణ ఉద్యమం జరిగిందే ప్రధానంగా నీళ్ల కోసమని... కానీ కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ సర్కార్ పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. బుధవారం(సెప్టెంబర్ 1) నాటి సమావేశంలో కృష్ణా జలాల్లో కేవలం 34 శాతం వాటాకు తెలంగాణ ప్రభుత్వం సంతకం పెట్టడాన్ని రేవంత్ తప్పు పట్టారు. కేసీఆర్ ఆ సంతకం ఎందుకు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం : రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే వైఖరిని అవలంభిస్తోందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా దక్షిణ తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. 2015లో అప్పటి జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 293 టీఎంసీల వాటాకు కేసీఆర్ అంగీకరించారని గుర్తుచేశారు. ఏడాది కోసం తాత్కాలికంగా చేసుకున్న ఈ ఒప్పందాన్ని... ఇప్పటివరకూ కొనసాగిస్తూ వచ్చారని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు,రాయలసీమ ప్రాజెక్టుల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అనుకూలంగా జీవోలు ఇచ్చిందని ఆరోపించారు.తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను పణంగా పెట్టి కేసీఆర్ ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు.
కేసీఆర్ తీరు దుర్మార్గం,అనాగరికం : రేవంత్ రెడ్డి
కృష్ణా జలాల వాటా విషయంలో అవసరమైతే కేంద్రంపై యుద్ధం చేస్తామని కేసీఆర్ ప్రకటించారని... కానీ ఆచరణలో అది ఎక్కడా కనిపించలేదని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరై ఛాయ్,బిస్కెట్లు తినడం తప్ప కృష్ణా జలాల వివాదంపై మాట్లాడలేదని ఎద్దేవా చేశారు.బుధవారం జరిగిన కేఆర్ఎంబీ సమావేశానికి హాజరుకావాల్సిన సీఎం కేసీఆర్... ఆ సమావేశానికి డుమ్మా కొట్టి ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో విందు భోజనానికి వెళ్లారని మండిపడ్డారు.ఇంతకంటే దుర్మార్గమైన అనాగరిక చర్య ఇంకేమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ఓవైపు తెలంగాణ ప్రజలపై కేఆర్ఎంబీ సమావేశంలో మరణ శాసనం రాస్తుంటే... మరోవైపు కేసీఆర్ దాన్ని పట్టించుకోకుండా విందు భోజనంలో పాల్గొనడం దేనికి సంకేతమని నిలదీశారు.
కృష్ణా జలాల పంపిణీ ఇలా...
కృష్ణా జలాలను 66 : 34 నిష్పత్తిలో ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు కేఆర్ఎంబీ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉండే తెలంగాణకు తక్కువ కేటాయింపులు,తక్కువ పరివాహక ప్రాంతం ఉండే ఏపీకి ఎక్కువ కేటాయింపులా అని సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించింది. రెండు రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో జల వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. అయితే బోర్డు మాత్రం అందుకు అంగీకరించలేదు. చివరకు 66 : 34 నిష్పత్తినే ఖరారు చేశారు. కృష్ణా జలాల కింద ఏపీలో ఎన్నో ఏళ్లుగా ఆయకట్టు,ప్రాజెక్టులు ఉన్నాయని... తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టులు కట్టి కేటాయింపులు అడగడమేంటని ఏపీ ప్రశ్నిస్తోంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులే తప్ప తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులేవీ మొదలుపెట్టలేదని తెలంగాణ వాదిస్తోంది. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో చూడాలి.