ట్విస్ట్.. దత్తాత్రేయ లేఖకు ముందే విద్యార్థుల బహిష్కరణ: రోహిత్ మృతిపై కిషన్ రెడ్డి
హైదరాబాద్/ముంబై: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని రోహిత్ ఆత్మహత్య పైన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మంగళవారం నాడు స్పందించారు. రోహిత్ మృతితో కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
యాకూబ్ మెమెన్ ఉరితీతతో విశ్వవిద్యాలయంలో వివాదం మొదలైందని చెప్పారు. యాకూబ్ మెమెన్కు అనుకూలంగా ఫేస్బుక్ కామెంట్స్ వచ్చాయని చెప్పారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఘటనను రాజకీయం చేయడం సరికాదన్నారు.
ఓ విద్యార్థి సుశీల్ పైన అర్ధరాత్రి దాడి జరిగిందని, అరెస్టులు జరిగాయని చెప్పారు. ఆ తర్వాతే విశ్వవిద్యాలయం విద్యార్థులను సస్పెండ్ చేసిందన్నారు. ఈ సస్పెన్షన్లో దత్తాత్రేయకు, స్మృతిలకు సంబంధం లేదన్నారు.
విశ్వవిద్యాలయంలో తమకు న్యాయం జరగడం లేదని కొందరు విద్యార్థులు వచ్చి బండారు దత్తాత్రేయ వద్ద మొరపెట్టుకున్నారని, అప్పుడు దత్తాత్రేయ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారని చెప్పారు.
దత్తాత్రేయ లేఖ రాసినప్పటికీ, ఆయన లేఖ వర్సిటీకి చేరకముందే విద్యార్థులను విశ్వవిద్యాలయం సస్పెండ్ చేసిందన్నారు. దత్తాత్రేయ ఆగస్టు 17న కేంద్రానికి లేఖ రాశారని, ఆ తర్వాత అయిదు నెలలకు అంటే డిసెంబర్ 27వ తేదీన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆ లేఖను విశ్వవిద్యాలయానికి పంపించారన్నారు.
అయితే, అంతకు అయిదు నెలల ముందే అంటే ఆగస్టు 31వ తేదీనే విశ్వవిద్యాలయంలో విద్యార్థులను బహిష్కరించారన్నారు. కాబట్టి దత్తాత్రేయ లేఖకు, స్మృతి ఇరానీ పంపించడానికి, విద్యార్థుల సస్పెన్షన్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అందుకు రికార్డులు కూడా ఉన్నాయని చెప్పారు. విద్యార్థుల బహిష్కరణకు వర్సిటీదే బాధ్యత అన్నారు.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ... రోహిత్ ఆత్మహత్య పైన ద్విసభ్య కమిటీని వేశామని, నివేదిక వచ్చాక మాట్లాడుతానని చెప్పారు. దీనిపై రాజకీయ వ్యాఖ్యలు చేయదల్చుకోలేదన్నారు.
కేంద్రానిదే బాధ్యత: పిడమర్తి రవి
రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమే బాధ్యత వహించాలని పిడమర్తి రవి అన్నారు. విద్యార్థుల పైన బహిష్కరణను ఎత్తివేయాలన్నారు. కేంద్రం బాధ్యత వహించాలని తెరాస వ్యాఖ్యానించింది. స్మృతి ఇరానీ, దత్తాత్రేయలను తప్పించాలని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కాగా, రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో బిఎస్పీ అధినేత్రి మాయావతి పార్టీ తరఫున ఇద్దరినీ హైదరాబాద్ పంపించారు. ఢిల్లీ, ముంబైలలో కొందరు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
యూనివర్సిటీల్లో అణిచివేత విధానాలు ఉన్నాయని విరసం వరవర రావు అన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. గత కొంతకాలంగా వర్సిటీల్లో సాగిన, సాగుతున్న అణచివేద విధానాలపై నిష్పాక్షిక విచారణ జరిపించి, దోషులను శిక్షించాలన్నారు.