జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీనివాసన్కు ఊరట
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ అధినేత, బీసీసీఐ మాజీ ఛైర్మన్ ఎన్.శ్రీనివాసన్కు హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ శ్రీనివాసన్ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతిస్తూ హైకోర్టు న్యాయమూర్తి బి.శివశంకరరావు శుక్రవారం తీర్పు వెలువరించారు.
ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా ఏ విధమైన ప్రయోజనం కూడా పొందలేదని, కుట్రలో శ్రీనివాసన్ పాత్ర లేదని స్పష్టం చేశారు. కంపెనీ చర్యలకు శ్రీనివాసన్ను బాధ్యుడు కాదని స్పష్టం చేశారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇండియా సిమెంట్స్కు కడప జిల్లా చౌడూరులో 2.60 ఎకరాల భూమి లీజు పొడిగింపు, రంగారెడ్డి జిల్లా కాగ్నా నుంచి అదనంగా 13 మిలియన్ క్యూబిక్ అడుగులు, కృష్ణా నుంచి అదనంగా 7 లక్షల గ్యాలన్ల నీటిని అప్పటి వై.ఎస్.నేతృత్వంలోని ప్రభుత్వం కేటాయించిందని సీబీఐ ఆరోపించింది.
అందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో రూ.140.32 కోట్లు పెట్టుబడి పెట్టారంటూ శ్రీనివాసన్పై అభియోగ పత్రంలో ఆరోపణ చేశారు. ఇందులో మూడో నిందితుడిగా ఉన్న శ్రీనివాసన్ తన పేరును కేసు నుంచి తప్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. కంపెనీ చర్యలకు ఎండీని బాధ్యులను చేయడం సరికాదని, బోర్డు తీర్మానం మేరకే అవి జరిగాయని శ్రీనివాసన్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు.
వాదనలు విన్న న్యాయమూర్తి.. భారతి మిట్టల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శ్రీనివాసన్పై ఉన్న కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇందులో నిందితుల జాబితాలో ఇండియా సిమెంట్స్ కొనసాగుతుంది.