హుస్సేన్ సాగర్ ప్రక్షాళన: ట్యాంక్బండ్పై ట్రాఫిక్ బంద్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ట్యాంక్బండ్ను తాత్కాలికంగా మూసివేశారు. హుస్సేన్సాగర్ ప్రక్షాళణలో భాగంగా 10 రోజుల పాటు ఈ మార్గాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బుద్ధభవన్ చౌరస్తాలో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి రోడ్డును బ్లాక్ చేశారు. వైశ్రాయ్ హోటల్ వద్ద పెద్ద గుంతకు మరమ్మత్తులు చేసి అక్కడి నుంచి నెక్లెస్రోడ్డు వైపు పనులు ప్రారంభించారు. కూకట్పల్లి నాలా నుంచి వచ్చే పైపును తిరిగి తీసివేసి నూతన పైపును వేసేందుకు మూడు కిలోమీటర్ల మేర భారీ సొరంగాన్ని తవ్వనున్నారు.
దీని ద్వారా భారీ పైప్లైన్ వేసేందుకు జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. 24 గంటల పాటు మూడు షిఫ్ట్లలో సిబ్బంది 10 రోజుల పాటు ఈ పనులను చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి రాణిగంజ్ వైపు అక్కడి నుంచి ట్యాంక్బండ్ వైపు వెళ్లే వాహనాలను కవాడీగూడ వైపు మళ్లించారు.
లక్షకుపైగా వాహనాలు ట్యాంక్బండ్ రోడ్డుపై నిత్యం ప్రయాణిస్తుంటాయి. ట్యాంక్ బండ్ మూసివేతపై ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.