కేసీఆర్Xబాబు: కేంద్రం వద్ద 'సీక్రెట్', అది మిలియన్ డాలర్ల ప్రశ్న
హైదరాబాద్: రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడిబీ) వివాదం కొనసాగుతోంది. తమ వెబ్ పోర్టల్ను ఏపీ కాపీ చేసిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతుండగా, మేం నెంబర్ 2లో ఉన్నామని, మేమెలా కాపీ చేస్తామని ఏపీ చెబుతోంది.
విభజన తర్వాత ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య పలు అంశాల్లో రగడ కనిపించింది, కనిపిస్తోంది. ఓటుకు నోటు అంశం ఇరు రాష్ట్రాలను కుదిపేసింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల పరంగా నీటి పారుదల ప్రాజెక్టులు, నీటి గొడవ, సెక్షన్ 8, షెడ్యూల్ 9, 10.. ఇలా ఎన్నో అంశాలపై వివాదం కనిపించింది.
'ఆ సీక్రెట్ మీకెలా తెలిసింది, హ్యాక్ చేశారా, నవ్వులపాలైన కేటీఆర్'
తాజాగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తెరపైకి వచ్చింది. మిగతా రగడలను పక్కన పెడితే, ఈ వివాదంలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని చెబుతున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంపై ఇటు మంత్రి కేటీఆర్, అటు ఏపీ నుంచి పరకాల ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఇతర నేతలు కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు.
ఈఓడీబీ విషయమై తెలంగాణ ప్రభుత్వం కేసు కూడా పెట్టింది. అయితే నేరుగా ఏపీ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అంటున్నారు. మీడియా ఎదుట మాత్రం ఏపీ ప్రభుత్వం పైన తెరాస నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. వారే కాపీ కొట్టారని నిందిస్తున్నారు.
దానికి ఏపీ ప్రభుత్వం నుంచి కూడా గట్టి కౌంటర్ వచ్చింది. తమ సర్వర్ నుంచి కేంద్రానికి వెళ్లిన రహస్య సమాచారాన్ని తెలంగాణ ఎలా హ్యాక్ చేసిందని ఏపీ ప్రశ్నిస్తోంది. హ్యాకింగ్ కూడా సైబర్ క్రైమ్ కిందకే వస్తుంది.
అయితే, ఇక్కడ విషయమేమంటే.. కేంద్రానికి వెళ్లిన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్రం ఎలా సేకరించగలిగింది అని ప్రశ్నిస్తున్నారు. దానిని విశ్లేషించి ఎలా ఫిర్యాదు చేయగలిగిందని అంటున్నారు.
ఇప్పుడు ఇవి మిలియన్ డాలర్ల ప్రశ్నలే అంటున్నారు. కేంద్రం వద్ద ఉన్న సమాచారం ఎలా లీక్ అయిందనేది ప్రశ్నే అంటున్నారు. ఇటు కేసీఆర్, అటు చంద్రబాబును కార్నర్ చేసే ఉద్దేశ్యంలో భాగంగా కేంద్రం ఏమైనా చేస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.