బడ్జెట్ లైవ్: అణగారిన వర్గాల్లో వెలుగులు నింపుతాం: ఈటెల
రాష్ట్రంలోని పేద, బడుగు బలహీన వర్గాలకు బడ్జెట్లో పెద్దపీట వేశామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రతులతో తన ఇంటి నుంచి అసెంబ్లీకి బయల్దేరే ముందు ఈటల మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: రాష్ట్రంలోని పేద, బడుగు బలహీన వర్గాలకు బడ్జెట్లో పెద్దపీట వేశామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రతులతో తన ఇంటి నుంచి అసెంబ్లీకి బయల్దేరే ముందు ఈటల మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల్లో విశ్వాసం నింపేలా బడ్జెట్ ఉంటుందని తెలిపారు.
అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణను తెచ్చుకున్నామని చెప్పారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉండాలనే సంకల్పంతో.. ఏ వర్గాలు అయితే అభివృద్ధి చెందలేదో.. ఆ వర్గాల అభివృద్ధే ఎజెండాగా బడ్జెట్ను రూపొందించడం జరిగిందన్నారు. కుల వృత్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన 60ఏళ్ల తర్వాత కూడా ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం కలగలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ముందడుగు వేస్తున్నామని చెప్పారు. అణగారిన వర్గాలకు అండగా ఉండి వారిలో విశ్వాసం నింపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరికంలో మగ్గే ప్రజలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 2017-18 బడ్జెట్ అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా తయారు చేయబడ్డదన్నారు. తెలంగాణ బడ్జెట్ సోమవారం ఉదయం అసెంబ్లీలో మంత్రి ఈటెల ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్నారు.
పొంతనే లేదు: ఉత్తమ్
బడ్జెట్ ప్రతిపాదనలకు వాస్తవాలకు పొంతనలేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అంకెల గారడీ చేస్తోందని ఆరోపించారు. ఇది ఇలా ఉండగా, సీఎల్పీ నేతలతో కలిసి బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరిద్దామని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోరగా.. అందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేయలేదు.
బడ్జెట్ ప్రసంగం బహిష్కరించడం బాగోదేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు షబ్బీర్ అలీ. స్పీకర్ను కొందరు సభ్యులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరదామని ఆయన సూచించారు. గవర్నర్ ప్రసంగం ప్రభుత్వ వ్వవహారాల్లోకి రాదని, అలాంటప్పుడు సభ్యులను ఎలా సస్పెండ్ చేస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు.