సొంత రాష్ట్రంలోనే దళితులకు అన్యాయం .. భూ పంపిణీ పంచ పాండవుల్లా మంచం కోళ్లు అనీ..
దళితులకు మూడెకరాల భూమి పథకం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి.. ఆ మాట అనేకంటే పంచపాండవుల్లా మంచంకోళ్లు ఐదుగురు అని మూడు వేళ్లు చూపినట్లు కనిపిస్తున్నది.
హైదరాబాద్: మూడున్నరేళ్ల క్రితం 2014 జూన్ రెండో తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం.. రాష్ట్ర సాధన ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలోనే తొలి సర్కార్ కొలువు దీరడం ఒక్కసారే జరిగాయి. నాటి నుంచి క్రమంగా బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకు సాగుతున్నామన్న ప్రచార ఆర్భాటం హోరెత్తింది.
ప్రతి కొత్త కార్యక్రమం, పథకం ప్రారంభ సమయంలో సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్ర పాలకుల వివక్షను వెలుగెత్తి చాటుతూ చెప్తే పెద్ద కథైతది అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సబ్బండ తెలంగాణ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి పరిణామమే ఆయన సారథ్యంలో సబ్బండ వర్ణాలు సాధించుకున్న సొంత తెలంగాణ రాష్ట్రంలోనే దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది.
పేద దళితులంతా ఆత్మ గౌరవంతో బతుకాలన్నదే తమ సర్కార్ విధానమని 2014 ఆగస్టు 15వ తేదీన హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోట నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన అన్న మాటలు. అందుకు అనుగుణంగా ఆరునూరైనా దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయడంతోపాటు వ్యవసాయానికి లాయకయ్యేలా అభివ్రుద్ధి చేస్తామని ఘంటాపథంగా చెప్పారు. దళితుల్లో ఆశలు చిగురించాయి. కాలం ఆగదుగా మూడేళ్లు గిర్రున తిరిగిపోయింది. కానీ దళితులకు మూడెకరాల భూమి పథకం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి.. ఆ మాట అనేకంటే పంచపాండవుల్లా మంచంకోళ్లు ఐదుగురు అని మూడు వేళ్లు చూపినట్లు కనిపిస్తున్నది.
విషమంగా ఇద్దరు దళిత యువకుల పరిస్థితి
ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో అర్హులైన దళితులు తమకు భూమి పంపిణీ ఎప్పుడని నిలదీస్తున్నారు. ఆందోళన బాట పడుతున్నారు. ఇతర జిల్లాల్లోనూ అర్హులైన దళితులు తమకు ప్రభుత్వం ఎప్పుడు భూమి పంపిణీ చేస్తుందని ఎదురుచూస్తున్నారని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. కరీంనగర్లోని మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు దళితులు ఆత్మహత్యాయత్నం చేసి, హైదరాబాద్ నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చావు బతుకులు మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ పథకం అమలు తీరును పరిశీలిద్దాం.
కేవలం 216 కుటుంబాలకే భూ పంపిణీ
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 1,48,982 దళిత కుటుంబాలకు 51,445 కుటుంబాలు భూమిలేని నిరుపేదలని గుర్తించారు. మరో 97,537 కుటుంబాలకు ఎకరానికి పైగా భూమి ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది.ఈ కుటుంబాలకు భూ పంపిణీకి ఎకరానికి రూ.2 లక్షల చొప్పున రూ.500 కోట్ల పై చిలుకు అవసరమని నిర్ధారించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో అందరికీ భూమి పంపిణీ చేయాలంటే రెండు లక్షల ఎకరాల భూమి కావాలి. ముందు భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ ఆచరణలోకి వచ్చే సరికి పరిస్థితులు ఊహలకు అతీతంగా మారాయి. ఎకరం భూమికి రూ.5 లక్షల నుంచి 7 లక్షలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా భూమి కొనుగోలు ముందుకు జరుగడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు కేవలం 216 కుటుంబాలకు మాత్రమే 558.27 ఎకరాల భూ పంపిణీ జరిగింది. ఇందుకు రూ.23.86 కోట్లు అధికారులు ఖర్చు చేశారు. తర్వాత మరో 100 ఎకరాల భూమి పంపిణీకి రంగం సిద్ధం చేశారు.
రూ.20 - రూ.50 వేలు ఇస్తే భూమి పక్కా
మరోవైపు లబ్దిదారుల ఎంపిక కూడా ఒక ప్రహసనంగా మారుతున్నది. నిరుపేద దళితులకు కాక.. వివిధ గ్రామాల్లో ఎంపిక చేసిన జాబితాల్లో ఎకరం ఆపై భూమి ఉన్న వారిని కూడా ఎంపిక చేసి వారికే పెద్దపీట వేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.20 నుంచి రూ.50 వేలు అధికారులకు సమర్పిస్తే తప్ప ఆ జాబితాలో తమ పేర్లు ఉండటం లేదని దళితులు ఆరోపిస్తున్నారు. గూడెంలో ఇద్దరు దళితులు ఆత్మహత్యాయత్నంతో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కాంగ్రెస్, సభా సంఘం విచారణ కోసం జేఏసీ డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు దళిత సంఘాలు, అఖిలపక్ష కమిటీ నాయకులు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. బెజ్జంకి మండలం గూడెం గ్రామంలో ఘటన దురద్రుష్టకరమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్తున్నారు. కాకపోతే ఈ ఘటనతో తనకేం సంబంధం లేదని స్థానిక ఎమ్మెల్యే.. రాష్ట్ర సాంస్క్రుతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ప్రకటించారు.
ఆదిలాబాద్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీపై విమర్శలు
ఆదిలాబాద్ జిల్లాలో నిరుపేద దళితులకు మూడెకరాల భూమి పంపిణీ విషయమై జిల్లా దళిత అభివ్రుద్ధి శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషన్ అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. అంతే కాదు స్వయం ఉపాధి పథకం కింద దళిత యువతకు ఇచ్చే రుణాల విషయంలోనూ కన్సెంట్ ఇవ్వొద్దని బ్యాంకుల మేనేజర్లపై ఎస్సీ కార్పొరేషన్ ఈవో శంకర్ ఒత్తిడి తెస్తున్నారని దళిత సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. తాము ప్రతిపాదించిన లబ్దిదారులకే రుణాలివ్వాలని, మాట వినకుంటే కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని వారిద్దరినీ పక్కకు తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్ వద్ద దళితులు ఆందోళనకు దిగారు. అంతకుముందు సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా, ఇప్పటివరకు జిల్లాలో 33,640 మంది భూమిలేని దళిత కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే జిల్లాలో 617 మంది లబ్ధిదారులకు 1,657 ఎకరాల భూమి పంపిణీ చేశారు. ఇందుకు రూ.67.18 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.
భూమి కోసం అప్పుల పాలవుతున్న దళితులు
దళితబస్తీ పథకంలో వ్యవసాయ భూమిని విక్రయించేందుకు దరఖాస్తు చేసుకున్న రైతుతోపాటు ఎంపికైన ఎస్సీ నిరుపేద లబ్ధిదారులకు మధ్య కొందరు దళారులుగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో స్థానికంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు దళారుల అవతారమెత్తి పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. అలా చేయని పక్షంలో లబ్ధిదారుల పేర్లను జాబితాలో నుంచి తొలగిస్తామని వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక వారి మాటలను విని లబ్ధిదారులు భూమి పట్టా చేతికందక ముందే వారి డిమాండ్లకు తలొగ్గి అప్పు పాలై మరీ వారి పర్సంటేజీలను అందజేస్తున్నట్లు సమాచారం. ఓ వైపు ప్రభుత్వం నిరుపేదలైన ఎస్సీ లబ్ధిదారులను ఆర్థికంగా ఆదుకునేందుకు భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంటే, కొందరు దళారులు లబ్ధిదారులతోపాటు భూమి విక్రయిస్తున్న వారి నుంచీ పర్సంటేజీలు తీసుకోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.