63 నుండి 68కి తెరాస బలం, క్యూలో ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాసలోకి ప్రతిపక్షాల శాసన సభ్యులు చేరుతున్న విషయం తెలిసిందే. ఈ మూడు నెలల కాలంలో తెరాస బలం 63 నుండి 68కి పెరిగింది. తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నుండి మరికొందరు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణ టీడీపీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్ మరో ఇద్దరు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం బీఎస్పీ, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు చేరారు. దీంతో తెరాస బలం 63 నుండి 68కి పెరిగింది.
అదే సమయంలో ఆరుగురు ఎమ్మెల్సీలు ఉండగా ఆ పార్టీ ఎమ్మెల్సీల బలం 20కి చేరుకుంది. ముందు ముందు మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరవచ్చునని అంటున్నారు.
తెరాస ప్రధానంగా హైదరాబాద్, ఖమ్మంల పైన దృష్టి సారించినట్లుగా చెబుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో తెరాసకు బలం అంతంతమాత్రమే. ఈ కారణంగానే ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరం, టీడీపీ ఎమ్మెల్యే తుమ్మలను తమ వైపు లాక్కున్నారని అంటున్నారు.
అలాగే, హైదరాబాదులో పట్టు కోసం మజ్లిస్ పార్టీతో కలవడంతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారి పైన దృష్టి పెట్టిందని అంటున్నారు. ఈ ఏడాది చివరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని తెరాస ఉవ్వీళ్లూరుతోంది. ఆ పార్టీకి పద్మారావు ఒక్కరు మాత్రమే హైదరాబాదు నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజధానిలో పార్టీ బలం పెంచుకునేందుకు ఏ అవకాశాన్ని తెరాస వదులుకోవడం లేదు.
తెరాసలో ఇప్పటి వరకు చేరిన ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప (బీఎస్పీ), ఇంద్రకరణ్ రెడ్డి (బీఎస్పీ), విఠల్ రెడ్డి (కాంగ్రెస్), కోరం కనకయ్య (కాంగ్రెస్), మదన్ (వైయస్సార్ కాంగ్రెస్)లు చేరారు. త్వరలో తుమ్మల నాగేశ్వర రావు చేరనున్నారు. తలసాని కూడా చేరుతారని అంటున్నారు.