సరిహద్దుల్లో ఉద్రిక్తత.!రాకపోకలపై ఆంక్షలు.!ఈపాస్ లు ఉంటేనే అనుమతిస్తామంటున్న డిఐజి రంగనాధ్.!
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దులు దాటాలంటే చంద్రమండలం వెళ్లినంత పనవుతోందని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షల సడలింపుల సమయంలో కూడా అనుమతించేది లేదని, అప్పుడు కూడా ఈపాస్ లు చూపిస్తేనే రాకపోకలకు అనుమతిస్తామని పోలీసులు నిర్ధారించడంతో ప్రయాణీకులు అవాక్కవుతున్నారు.
ఆంక్షల సడలింపు సమయంలో పాస్ లంటే అప్పటికప్పుడు ఎక్కడినుండి తేవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణీకులు. దీంతో తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల వద్ద వేలకొద్ది వాహనాలు నిలిచిపోతున్నట్టు తెలుస్తోంది. అత్యవసర వైద్య సహాయం కోసం వచ్చేవారికి సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా నల్లగొండ డిఐజి రంగనాధ్ కొన్ని మార్గదర్శకాలు వివరిస్తున్నారు.

అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద లాక్డౌన్ మినహాయింపు సమయంలోనూ ఈ పాస్ ఉంటేనే అనుమతిస్తామని తేల్చి చెప్తున్నారు పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పోలీసులు జారీ చేసిన పాస్ ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు. అంబులెన్సులకు ఎలాంటి ఆంక్షలు లేకపోగా, ప్రైవేట్ వాహనాలలో ఆంధ్రా నుండి తెలంగాణకు వచ్చే కోవిడ్, ఇతర రోగులు ఆస్పత్రుల నుండి ఇచ్చిన లెటర్స్, సంబంధిత పత్రాలు ఉంటేనే అనుమతిస్తామని అంటున్నారు.
లాక్డౌన్ మినహాయింపు సమయంలోనూ ఉదయం 6.00 నుండి 10.00 గంటల వరకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలు విధిగా ఈ పాస్ కలిగి ఉంటేనే అనుమతిస్తామని నల్లగొండ డిఐజి రంగనాధ్ స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రా నుండి తెలంగాణలోకి వచ్చే వారు పోలీసుల సూచనలు పాటించాలని, సరిహద్దుల వద్ద ఈ పాస్ లేకుండా వచ్చి ఇబ్బందులు పడవద్దని ఆయన సూచించారు. సరిహద్దుల వద్ద ఈ పాస్, ఎలాంటి అనుమతి లేకుండా వస్తున్న వాహనాలతో వాహనాల రద్దీ పెరిగిపోతుందని, అత్యవసర పరిస్థితుల్లో ఈ పాస్ పొందలేని వారు సరైన ఆధారాలు చూపించి అత్యవసర వైద్యం కోసం వచ్చినట్లయితే విచారించి అలాంటి వాహనాలను మానవతా దృక్పథంతో అనుమతిస్తామని వివరిస్తున్నారు రంగనాథ్.












Click it and Unblock the Notifications