భవన నిర్మాణ కార్మికులకు రూ. 1500 అదనపు సాయం చెయ్యండి : బండి సంజయ్
కరోనా లాక్ డౌన్ ప్రభావం రైతుల మీద దారుణంగా ఉందని , రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మే డే నాడు భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అదనపు సాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా కార్మిక లోకానికి శుభాకాంక్షలు చెప్పిన బండి సంజయ్ తెలంగాణలోని కార్మికులందరూ ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావంతో విలవిలలాడుతున్నారని పేర్కొన్నారు.
అనునిత్యం అన్ని రంగాల్లో కార్మికులు తమ శ్రమను ధారపోస్తున్నారని అలాంటి కార్మికులను కష్ట కాలంలో ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. లేబర్ కమిషన్ తీర్మానం ప్రకారం ప్రభుత్వం వెంటనే భవన నిర్మాణ కార్మికులందరికీ రూ. 1500 అందించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ నేపధ్యంలో పనుల్లేక , భవన నిర్మాణ రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు . కార్మికుల సహాయ నిధి విషయంలో కేంద్రం పూర్తి ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోకపోవడం దురదృష్ణకరమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మే డే సందర్భంగానైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భవన నిర్మాణ కార్మికులకు రూ. 1500 లను వారి ఖాతాలకు జమ చెయ్యాలని ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అందజేసిన రూ. 1500 మాత్రమే కుటుంబ పోషణకు సరిపోదని , ఇక దానితో కార్మికులను మోసం చేయడం తగదని విమర్శించారు. వారికి తక్షణమే అదనపు సాయం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ఇక లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న కర్షక కార్మిక లోకానికి బీజేపీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు .