టీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం: డిజిటల్ పేమెంట్స్ తో జర్నీ.. రాష్ట్రంలోని ఆ మార్గాల్లో అమలు!!
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని లాభాల బాట పట్టించటం కోసం అనేక సంచలన నిర్ణయాల దిశగా టీఎస్ఆర్టీసీ అడుగులు వేస్తుంది. తాజాగా డిజిటల్ చెల్లింపుల ద్వారా ఆర్టిసి సేవలను వినియోగించుకోవడం కోసం టీఎస్ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్న నేటి రోజుల్లో పే యాప్స్ (డిజిటల్ చెల్లింపులు) ద్వారా లావాదేవీలు జరుపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో తెలంగాణ ఆర్టీసీ కూడా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం డిజిటల్ చెల్లింపుల విధానాన్ని తీసుకొస్తోంది.

డిజిటల్ చెల్లింపులకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
ప్రస్తుతం సమాజంలో నగదు వినియోగం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా, నగదు లావాదేవీలు పెద్దగా జరగడం లేదు. అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే మాత్రం కచ్చితంగా నగదు అవసరమవుతుంది . ప్రయాణ సమయంలో నగదు లేకుంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులో సైతం నగదు రహిత లావాదేవీలకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిజిటల్ చెల్లింపులు చేసే ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

కరీంనగర్ రీజియన్ లో డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి
ఇక నుండి ఆర్టీసీలో క్యూఆర్ కోడ్తో కూడిన క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్లతో యూపీఐ చెల్లింపులు ఆమోదించబడతాయి. ఈ మేరకు కరీంనగర్ రీజియన్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. టికెటింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆర్టీసీ ఇప్పటికే టిమ్స్ను ప్రవేశపెట్టింది. వాటి ద్వారానే డిజిటల్ చెల్లింపులు జరపాలని నిర్ణయించారు. డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో స్వైప్ చేయడం తో పాటు, QR కోడ్తో టిక్కెట్లను కొనుగోలు చెయ్యవచ్చు. గ్రేటర్ హైదరాబాద్లో ఈ విధానం అమలవుతుండగా.. తాజాగా కరీంనగర్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చింది.

కరీంనగర్ రీజియన్ బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల సేవలు అందిచే బస్సులు ఇవే
కరీంనగర్ రీజియన్ లో రాజధాని, హైటెక్ , సూపర్ లగ్జరీ, గరుడ, గరుడ ప్లస్ తదితర దూర ప్రాంతాలకు బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చి, నగదు రహిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ విధానాన్ని కొన్ని బస్సు సర్వీసుల్లో మాత్రమే అమలు చేస్తున్నామని, త్వరలో దశలవారీగా అన్ని బస్సుల్లో అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నగదు రహిత సేవలను అందించే పరికరాల వినియోగంపై సూపర్ వైజర్లకు హైదరాబాద్ లో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. అక్కడ శిక్షణ తీసుకున్న అధికారులు బస్సుల్లో ఈ సేవలను ప్రారంభించారు.

ప్రయోగం సక్సెస్ అయితే మిగతా ప్రాంతాలకు సేవలు
బస్సులో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి తదితర వివరాలను ఐ టిమ్ ల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. అయితే.. ఐ-టిమ్ వినియోగానికి తప్పనిసరిగా ఇంటర్నెట్ ఉండాలి. అన్ని ప్రాంతాలకు సిగ్నల్స్ లేని కారణంగా దీన్ని అధిగమించేందుకు వీటిలో రెండు సిమ్లు ఉపయోగించనున్నట్లు చెబుతున్నారు. దీంతో కొంత నెట్వర్క్ పనిచేస్తోందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆర్టీసీ చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ అయితే, మిగతా ప్రాంతాలకు కూడా క్యాష్ లెస్ డిజిటల్ చెల్లింపుల సేవలను విస్తరించాలని టీఎస్ఆర్టీసీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications