టిఆర్ఎస్ ఎమ్మెల్యేని నిలదీసిన ప్రజలు, సుప్రీం కోర్టుకెళ్తా: ఎస్సైని ప్రశ్నించిన విహెచ్
వరంగల్: వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. పలు సందర్భాల్లో మంత్రులు, ఇతర నేతలను ప్రజల ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను గ్రామస్థులు నిలదీశారు.
రఘునాథపల్లి మండలం కుర్చపల్లి, కోమళ్ల గ్రామాలలో ఆయనను ప్రజలు నిలదీశారు. ఇళ్లు నిర్మిస్తామని చెప్పి ఇప్పటి వరకు నెరవేర్చలేదని, తమ గ్రామం నుంచే కాలువ వెళ్తున్నా సాగునీరు అందడం లేదని, సబ్ స్టేషన్ మంజూరు చేయిస్తానని చెప్పి ఇప్పటికీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజయ్య వారికి నచ్చచెప్పారు.
జగన్, కెసిఆర్ కుమ్మక్కు: విహెచ్
సిఎం కెసిఆర్, వైసిపి అధినేత జగన్ ఇద్దరు కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి కడియంను నిలదీసి జైలుకెళ్లిన రైతు కొమురయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకే జగన్ వరంగల్ వచ్చారని మండిపడ్డారు.
అంతకుముందు విహెచ్ శాయంపేట పోలీస్ స్టేషన్ వెళ్లారు. ప్రభుత్వ అధికారుల విధులను ఆటంకపరిచిన కేసును కొమురయ్య పైన ఎలా పెట్టి జైలులో పెడతారని ఎస్సైని నిలదీశారు. ఆ సెక్షన్ తొలగించకుంటే తాను సుప్రీం కోర్టులో కేసు వేస్తానని చెప్పారు. కెసిఆర్కు బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ అభ్యర్థి సర్వేను గెలిపించాలన్నారు.
సోనియా వల్లే తెలంగాణ: షిండే
తెలంగాణ బిల్లుపై నాడు సోనియా గాంధీ సంతకం చేయడం తన అదృష్టమని, సోనియా తీసుకున్న కఠోర నిర్ణయం కారణంగానే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని, ప్రత్యేక తెలంగాణ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని, కానీ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ తన హామిని మాత్రం నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు.
ఇద్దరు ఎంపీల వల్లే తెలంగాణ: వినోద్ కుమార్
పార్లమెంటులో ఇద్దరు ఎంపీలున్న టిఆర్ఎస్ ఎలా తెలంగాణ తెచ్చిందన్న కాంగ్రెస్ నేతలకు ఎంపీ వినోద్ కుమార్కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ నాయకత్వంలో ఇద్దరు ఎంపీలే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సమయంలో కెసిఆర్, విజయశాంతిలు మాత్రమే ఎంపీలుగా ఉన్న విషయం తెలిసిందే.