పీవీ జయంతి: 'కేసీఆర్కు అంత టైం కూడా లేదా', 'ప్రధానిగా చేసిన ఘనత ఎన్టీఆర్ది'
హైదరాబాద్: పీవీ నర్సింహా రావు జయంతి నేపథ్యంలో ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొనడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆదివారం విమర్శలు గుప్పించింది. ఇదేనా తెలంగాణ బిడ్డకు కేసీఆర్ ఇచ్చే గౌరవమని ప్రశ్నించారు. పీవీకి నివాళులు అర్పించే సమయం కూడా ముఖ్యమంత్రికి లేదా అన్నారు.
తెలుగుదేశం పార్టీ కూడా కేసీఆర్ పైన మండిపడింది. పీవీ కార్యక్రమాలు మొక్కుబడిగా నిర్వహించడం మాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన గౌరవమివ్వాలని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. పీవీని ప్రధానిగా చేసిన ఘనత ఎన్టీఆర్దే అన్నారు.
కలిసిన ఇరు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు కలిశారు. పీవీ 94వ జయంతి సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్టాల కాంగ్రెస్ నేతలు కలిశారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కలిసి నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
పక్కపక్కనే నిలబడి మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఘనత పీవీదేనని వారు కొనియాడారు. జాతిపిత మహాత్ముడిని చంపిన గాడ్సే ఒక్కరే బీజేపీకి నాయకుడు అన్నారు. పీవీ జయంతి తమ ఇరు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలను కలిపిందన్నారు.
75 లక్షల ఎకరాలను పేదలకు పంచిన పీవీ నర్సింహా రావు మహనీయుడు అన్నారు. బీజేపీకి నాయకులు లేక సర్దార్ వల్లభాయ్ పటేల్ను ప్రమోట్ చేస్తోందన్నారు. సంస్కరణల పైన పీవీ ధైర్యంగా ముందుకు అడుగు వేశారని చెప్పారు.