దళితబంధు అన్నీచోట్ల అమలు చేయాలి.. లేదంటే నిరసనలు: ఎమ్మార్పీఎస్
దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాల్సిందే. లేదంటే ఇతర ప్రాంతాల నుంచి నిరసనలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిట్బ్యూరో సభ్యుడు బొడ్డు దయాకర్ మాదిగ హెచ్చరించారు. 'దళితబంధు'ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్తో ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో వరంగల్లోని బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షలు గురువారం మూడో రోజు కొనసాగాయి. దీక్ష శిబిరాన్ని దయాకర్ మాదిగ, వేల్పుల సూరన్న, గోవిందు నరేష్, బొర్ర భిక్షపతి మాదిగ సందర్శించారు.
ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందాలని దయాకర్ మాదిగ అన్నారు. లేదంటే సెప్టెంబరు 5న హుజూరాబాద్లో దళిత గర్జన సభ నిర్వహించి ఆందోళన చేపడతామన్నారు. దీక్షలో ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల నాయకులు ఈర్ల కుమార్ మాదిగ, జన్ను యేసేబు, రాజు మాదిగ, గంగారపు మల్లన్న, ఆనంద్ మాదిగ, కొమురయ్య, ముఖేష్ పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ ఈ నెల 31లోగా దళితబంధు పథకం ద్వారా రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హసన్పర్తి మండల కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు గురువారంతో 3వ రోజుకు చేరాయి. ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. దళితబంధు అమలు కోసం లక్ష కోట్లు అయినా ఖర్చు చేస్తానన్న కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్లో 2 వేల కోట్లు ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని దళితులు ఆలోచించాలన్నారు. దళితబంధును ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉప ఎన్నికల కన్నా ముందే రైతు బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాజీపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఎస్సీ అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్, మాలమహానాడు నాయకులు చేపట్టిన దీక్ష రెండో రోజు కొనసాగింది. మాదిగ, మాలమహానాడు నాయకులు హాజరై దీక్షను ప్రారంభించారు.
Recommended Video
హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బొక్కల నారాయణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ దళిత బంధు పథకాన్ని వర్తింప చేయాలని ఎస్సీ 59 ఉప కులాల సమగ్ర అభివృద్ధి సాధన కమిటీ ఆధ్వర్యంలో గురువారం హన్మకొండ అశోక కాలనీలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ గతం లో దళితలకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని లేకుంటే హుజూరాబాద్ ఉప ఎన్నికలో దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.